హైదరాబాద్,వెలుగు: కార్లను ఎంగేజ్ చేసుకుని సెకండ్ హ్యాండ్ కింద అమ్ముతున్న గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో పాటు కార్లు కొని కమీషన్ పై సేల్స్ చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. 50 కార్లు సీజ్ చేశారు. రెండేండ్లలో ఈ గ్యాంగ్ రూ.4 కోట్ల 50 లక్షల విలువైన 272 కార్లతో చీటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను సీపీ సజ్జనార్ సోమవారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం ఎస్ఎన్ కాలనీకి చెందిన పల్లె నరేశ్కుమార్(36) చేవెళ్ళలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మూడేండ్ల పాటు మెయింటెనెన్స్ మేనేజర్గా పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీ అవసరాల కోసం కార్లను ఎంగేజ్ చేసుకోవడం గురించి తెలుసుకున్నాడు. 2019లో తనే సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కారు మోడల్,కండీషన్ను బట్టి రూ.20 వేల నుంచి 40వేలకు ఓనర్స్తో మంత్లీ రెంట్ అగ్రిమెంట్ చేసుకునేవాడు. ఇందుకోసం సిటీతో పాటు ఆర్సీపురం, పటాన్చెరు లాంటి శివారు ప్రాంతాల్లో కారు ట్రావెల్స్ ఏజెన్సీలను సంప్రదించేవాడు. వారి దగ్గరి నుంచి కార్లను ఎంగేజ్ చేసుకుని తర్వాత వాటిని సెకండ్ సేల్ చేసేందుకు స్కెచ్ వేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ కంసాన్పల్లికి చెందిన ఎంపీటీసీ బదావత్ రాజునాయక్(31), అతడి ఫ్రెండ్ తళ్ల నర్సింహ గౌడ్(30), నాగర్ కర్నూల్ జిల్లా పదరకు చెందిన కలముల వికాస్(21), హన్మకొండకు చెందిన గొల్లె భరత్ జోషి(23), కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన భానురి ఎలక్షన్రెడ్డి(35) తో కలిసి నరేశ్ కుమార్ 77 కార్లను సెకండ్ హ్యాండ్ కింద అమ్మాడు.
వేలం, సబ్సిడీ పేరుతో..
రెంట్కి తీసుకున్న కార్లను దూర ప్రాంతాల్లోని వ్యక్తులకు వేలం, బ్యాంక్ లోన్, సెంట్రల్ సబ్సిడీ మీద కొన్నామని చెప్పి ఈ గ్యాంగ్ అమ్మేది. రెండేండ్లలో ఇలా 272 కార్లను రెంట్ పేరుతో ఎంగేజ్ చేసుకుని సెకండ్ సేల్ చేసింది. ఆర్సీపురం ఎస్ఎన్ కాలనీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ రాపోలు ఆదిత్య నుంచి నరేశ్కుమార్11 కార్లు ఎంగేజ్కి తీసుకుని 3 నెలలు రెంట్ కట్టాడు. తర్వాత ఆ కార్లను సెకండ్ సేల్స్లో అమ్మేశాడు. ఏప్రిల్ 21న ఆదిత్య ఆర్సీపురం పీఎస్లో కంప్లయింట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నరేశ్ కుమార్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. షాద్నగర్, వికారాబాద్ జిల్లా యాలాల, కేశంపేట పీఎస్ల్లోనూ ఈ గ్యాంగ్ పై కేసులు ఫైల్ అయినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.