
- ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని స్కూళ్లల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా హెచ్చరించారు. ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫిక్సేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీస్ బిల్~ 2025 డ్రాఫ్ట్కు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బిల్ ద్వారా ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజు పెంపునకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఫీజు పెంపుపై నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఈ బిల్లును ఆమోదించడానికి త్వరలో అత్యవసర అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీ విద్యా శాఖ మంత్రి ఆశిశ్ సూద్ మాట్లాడుతూ..స్కూల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడు అంచెల కమిటీలను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తున్నదని చెప్పారు. స్కూల్ స్థాయి కమిటీలో పాఠశాల నిర్వహణ చైర్పర్సన్, సభ్య కార్యదర్శిగా ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు, ఐదుగురు తల్లిదండ్రులు ఉంటారని వివరించారు.
ఇది పాఠశాల యాజమాన్యంతో ఫీజు పెంపు ప్రతిపాదనలను చర్చిస్తుందన్నారు. ఇక్కడ సమస్య పరిష్కారం కాకుంటే జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని.. అక్కడ కూడా పరిష్కారం లభించకుంటే ఫీజు పెంపుపై రాష్ట్ర స్థాయి కమిటీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఈ నిర్ణయం మూడు విద్యా సంవత్సరాలు చెల్లుబాటు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.