- కొత్తగా డెక్సా పరీక్షను ప్రవేశపెట్టాలని నిర్ణయం
- ప్లేయర్ల ఫిట్నెస్, వర్క్లోడ్పై బీసీసీఐ ఫోకస్
- రోహిత్ కెప్టెన్సీకి ముప్పు లేనట్టే
మెగా టోర్నీల్లో వరుస ఫెయిల్యూర్స్.. ప్రధాన ప్లేయర్ల గాయాలు.. యంగ్స్టర్స్లో లోపిస్తున్న ఫిట్నెస్ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేయర్ల సెలెక్షన్కు గతంలో ఉన్న ‘యో‑యో’ ఫిట్నెస్టెస్ట్తో పాటు డెక్సా పరీక్షను తప్పనిసరి చేసింది. దీంతో గాయాలతో టీమ్కు దూరమైన ప్లేయర్లు, నేషనల్ టీమ్లో బెర్త్ ఆశించే ప్రతీ క్రికెటర్ ఇకపై ఈ రెండు టెస్టులు పాస్ కావాల్సిందే.
న్యూఢిల్లీ: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్కప్ కోసం బీసీసీఐ పక్కా రోడ్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఈ టోర్నీని దృష్టిలో పెట్టుకుని క్రికెటర్ల ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచింది. నేషనల్ టీమ్ ప్లేయర్ల కోసం ‘యో‑– యో’ టెస్ట్ను మళ్లీ తీసుకొచ్చింది. దీంతో పాటు కొత్తగా ‘డెక్సా టెస్ట్’ (బోన్ స్కాన్ టెస్ట్)ను కూడా తప్పనిసరి చేసింది. ప్లేయర్ల సెలెక్షన్లో ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆదివారం ముంబైలో జరిగిన హై ప్రొఫైల్ రివ్యూ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఈ మీటింగ్కు హాజరయ్యారు. ‘టీమ్ ఎంపికలో యో యో, డెక్సా టెస్ట్లను పరిగణనలోకి తీసుకుంటాం. సెంట్రల్ పూల్ ప్లేయర్లకు ప్రత్యేకమైన రోడ్ మ్యాప్ను అమలు చేస్తాం’ అని బీసీసీఐ పేర్కొంది.
యంగ్స్టర్స్ డొమెస్టిక్ ఆడేలా..
ప్లేయర్ల అందుబాటు, వర్క్లోడ్ మేనేజ్మెంట్, ఫిట్నెస్తో పాటు వన్డే వరల్డ్కప్ రోడ్ మ్యాప్పై ఈ మీటింగ్లో ఎక్కువగా చర్చ జరిగింది. నేషనల్ టీమ్కు ఎంపిక కావాలనుకునే ఎమర్జింగ్ ప్లేయర్లు వీలైనంత ఎక్కువగా డొమెస్టిక్ సీజన్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈసారి ఐపీఎల్లో పాల్గొనే ప్రధాన ప్లేయర్లపై ఎన్సీఏ ఎక్కువగా ఫోకస్ చేయనుంది. ఎఫ్టీపీని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ఆయా ఫ్రాంచైజీలతో కలిసి పని చేయాలని డిసైడ్ చేశారు. గాయాల కారణంగా దీపక్ చహర్, బుమ్రా వంటి ప్లేయర్లు రెగ్యులర్గా టీమ్కు దూరం కావడంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది. దీంతో ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.
వరల్డ్ కప్ కోసం 20 మందితో షార్ట్లిస్ట్
అక్టోబర్–నవంబర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పట్నించే ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా మెగా టోర్నీ కోసం 20 మంది ప్లేయర్లతో షార్ట్ లిస్ట్ను రూపొందించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్, వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఈ 20 మందిని మెగా టోర్నీ వరకు రొటేట్ చేయనున్నారు.
రోహిత్, ద్రవిడ్ కొనసాగింపు
టీ20 కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మీటింగ్కు హాజరుకాలేదు. మంగళవారం నుంచి శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కోసం పాండ్యా రెడీ అవుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. టెస్ట్, వన్డేలకు అతడినే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే, కోచ్గా ద్రవిడ్పని తీరుపైనా బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక, చేతన్ శర్మ ఈ మీటింగ్కు హాజరుకావడంతో.. మరోసారి అతన్నే సెలెక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగింవచ్చని సమాచారం. ఒకవేళ చైర్మన్గా కాకపోయిన నార్త్జోన్ నుంచి సెలెక్టర్గా కొనసాగించొచ్చు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ త్వరలోనే కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేయనుంది.