భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్టు చాతకొండ బీట్పరిధిలోని రేగళ్ల క్రాస్రోడ్డులో సాతి భవాని పేర మహా జాతర జరుపుతామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, అక్కడ జాతర నిషేధం అని జిల్లా అటవీశాఖాధికారి కిష్టా గౌడ్ తెలిపారు. పాల్వంచలోని వన విహార్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు రేగళ్ల క్రాస్ రోడ్డులో సాతి భవాని జాతరంటూ బంజార సంఘాల పేరుతో భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వాల్ పోస్టర్లు వేస్తూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జాతర జరుపుతామని చెప్తున్న ప్లేస్ రిజర్వ్ ఫారెస్టులోనిదని, ఆ ప్రాంతం కిన్నెరసాని వన్య ప్రాణుల అభయారణ్యానికి సంబంధించిన ఇకో సెన్సిటీవ్ జోన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రదేశమని చెప్పారు.
జాతరకు సంబంధించి ఫారెస్టు, రెవెన్యూ, కేటీపీఎస్, పోలీస్ శాఖల నుంచి ఎటువంటి పర్మిషన్స్లేవన్నారు. జాతర పేర ఎవరైనా ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జాతర పేర ప్రచారం చేసే వారిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామన్నారు. కాగా, ఇదే విషయమై లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ జి. శిరీష కూడా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేగళ్ల గ్రామంలోని చాత కొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయనే సమాచారంతో సెక్షన్ 163బీఎన్ఎస్ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.
