క్రాప్ లోన్ పెండింగ్ ఉందని బ్యాంకు అధికారులు రైతుబంధు పైసలు ఇవ్వకపోవడంతో ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా దేవాపూర్కు చెందిన జాదవ్ రోహిదాస్(40) కు రైతుబంధు కింద రూ.15 వేలు అకౌంట్లో పడ్డాయి. ఆ పైసల కోసం బ్యాంకుకు వెళ్లగా రూ. 62 వేల క్రాప్ లోన్ ఉందని, అకౌంట్ను హోల్డ్లో పెట్టామని అధికారులు చెప్పారు. దీంతో రోహిదాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆసిఫాబాద్, వెలుగు: క్రాప్ లోన్ ఉందని రైతుబంధు పైసలు ఇవ్వకపోవడంతో ఓ రైతు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో జరిగింది. కెరమెరి మండలం దేవాపూర్ కు చెందిన జాదవ్ రోహిదాస్ (40) కు 3 ఎకరాలు ఉండగా, పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవలే రైతుబంధు కింద రూ.15 వేలు అకౌంట్లో పడ్డాయి. ఆ పైసలు తెస్తే పెట్టుబడులకు పని కొస్తాయని ఆశపడ్డాడు. డ్రా చేసేందుకు ఈనెల 22న కెరమెరిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో రోహిదాస్ పేరు మీద రూ. 62 వేల క్రాప్ లోన్ ఉంది. దాన్ని ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో రోహిదాస్ ఖాతాను హోల్డ్లో పెట్టారు. వడ్డీ కట్టి లోన్ రెన్యువల్ చేసుకుంటే రైతుబంధు పైసలు డ్రా చేసుకోవచ్చని బ్యాంకోళ్లు చెప్పారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై బుధవారం గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.