
- నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట ఘటన
నర్సంపేట, వెలుగు: 10 రోజుల నుంచి వడ్లు కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన ఓ రైతు వడ్లను తగలబెట్టేందుకు యత్నించాడు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట సోమవారం సాయంత్రం చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి చెందిన లావుడియా భద్రు తాను పండించిన వడ్లను కాలబెట్టేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భద్రు తన రెండెకరాలతో పాటు మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశాడు. 934 బస్తాల ధాన్యాన్ని (374 క్వింటాళ్లు) జోజిపేట కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. కేంద్రం నిర్వాహకులు తేమ సాకుతో కొనుగోలు చేయలేదు.
నర్సంపేట మిల్లుకు తీసుకెళ్లాలని సూచించారు. తన ధాన్యాన్ని నాలుగు ట్రాక్టర్లు, ఒక డీసీఎంలో లోడ్ చేసుకుని నర్సంపేటలోని ఖానాపురం రోడ్ బాయిల్డ్ రైస్ మిల్లుకు తీసుకెళ్లగా, వారు తిప్పి పంపారు. దీంతో భద్రు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించాడు. ఎమ్మెల్యే మిల్లర్కు చెప్పినా, ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక నాలుగు రోజుల కింద వడ్లను చెన్నారావుపేట సొసైటీ ప్రాంగణానికి తీసుకొచ్చాడు.
ట్రాక్టర్లు, డీసీఎం ఓనర్లు తాము కిరాయి నష్టపోతున్నామని చెప్పడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. కలత చెందిన భద్రు బాటిల్లో రెండు లీటర్ల పెట్రోల్ నింపుకొని, వడ్ల లోడ్తో ఉన్న ట్రాక్టర్ను నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చాడు. మెయిన్ గేట్ ఎదుట వడ్ల బస్తాలను అన్లోడ్ చేస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. రైతు వద్ద ఉన్న పెట్రోల్ను స్వాధీనం చేసుకున్నారు. రైతుకు నచ్చజెప్పి ట్రాక్టర్ను ఖానాపురం రోడ్ పారా బాయిల్డ్ రైస్ మిల్లుకు తరలించారు. చెన్నారావుపేట సొసైటీ ఆవరణలో ఉన్న వడ్లను సైతం కొనుగోలు చేయిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతు
శాంతించాడు.