
- బఫర్ స్టాక్ లేక ఇబ్బందులు
- క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం
- సమన్వయం లేక రైతులకు పాట్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. వర్షాలు దండిగా పడుతున్నా పలు ప్రాంతాల్లో పంటలకు వేయడానికి యూరియా లేదు. వినియోగం గణనీయంగా పెరుగడంతో ఇప్పుడున్న నిల్వలు సరిపోతలేవు. మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఎరువుల సరఫరా జరుగుతున్నది. ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువులను రైతులకు అందిస్తున్నది. అయితే గత కొంత కాలంగా వానలు లేక ఎరువుల వాడకం తగ్గింది. తాజాగా వానలు పడుతుండటంతో ఎరువుల వాడకం ఒక్క సారిగా పెరిగి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎరువుల సరఫరాపై అనేకచోట్ల సందిగ్ధత నెలకొంది. మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ మెయింటెయిన్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తుండడంతో సమస్య ఏర్పడుతున్నది. ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగా కనీసం 2 లక్షల టన్నుల అవసరం ఉండగా.. ఇప్పుడు లక్షా 10 టన్నులే బఫర్ స్టాక్ ఉంది. మార్క్ఫెడ్ అధికారులు, జిల్లాల్లో అగ్రికల్చర్ అధికారుల సమన్వయ లోపమే యూరియా కొరతకు దారితీస్తున్నట్లు తెలుస్తున్నది.
సమస్యకు కారణమేందంటే..
వానాకాలం సీజన్లో ఎరువుల లభ్యత బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైనంత సరఫరా అయిందని చెబుతున్నారు. కానీ ఎరువుల రవాణా టెండర్లు గత కొన్నేళ్లుగా ఒకే సంస్థకు ఇస్తుండడంతో సప్లైలో ఇబ్బందులు వస్తున్నాయనే విమర్శ ఉంది. కొన్ని చోట్ల జిల్లా అధికారులు ఎరువుల కేటాయింపులు ప్రైవేట్ డీలర్లకే నేరుగా అందించడంతో సమస్య ఎక్కువవుతున్నది.అవసరాన్ని బట్టి కేటాయింపులు చేయాల్సి ఉండగా కొందరు అధికారులు కొన్ని ప్రాంతాలకే తరలించి మరికొన్ని ప్రాంతాలను
విస్మరిస్తున్నారు. దీంతో సమస్య ఏర్పడుతోంది.
బకాయిలు పెండింగ్..
కొన్ని సహకార సంఘాలు ఎరువులు అమ్మిన డబ్బులు మార్క్ ఫెడ్కు చెల్లించకుండా ఇతర అవసరాలకు వాడుకున్నాయి. మార్క్ ఫెడ్కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా
నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో ఎరువుల సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. బకాయిలపై ఎప్పటికప్పడు పర్యవేక్షించాల్సిన మార్క్ఫెడ్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. సరైన నిర్వహణ చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలుస్తున్నది. ప్యాక్స్ల రికార్డులను సక్రమంగా పరిశీలించకపోవడం, అవినీతి అక్రమాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా వాటి పనితీరు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా సహకార సంఘాలు ఎరువుల
విక్రయాలు చేసినా వాటికి సంబంధించిన డబ్బులు మార్క్ఫెడ్కు సకాలంలో చెల్లించడంలేదు. దీంతో కోట్ల రూపాయలు బకాయిల రూపంలో మిగిలిపోతున్నాయి.
రాష్ట్రంలో ఎరువుల అవసరాలు ఇలా..
రాష్ట్రంలో ఈ సీజన్లో 25 లక్షల మెట్రిక్ టన్నులతో ఎరువుల ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది.
ఆ మేరకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరింది. యూరియా 10లక్షల టన్నులకు పైగా అవసరం ఉండగా, డీఏపీ 1.20 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 5.50 లక్షల టన్నులు, ఎంఓపీ ఎరువులు 1.10 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ ఎరువులు 50 వేల టన్నులు, ఇతరత్రా ఉన్నాయి. రాష్ట్రంలో రెండు సీజన్లు కలిపి 3.16లక్షల టన్నుల డీఏపీ, 17.54లక్షల టన్నుల యూరియా, 2.49 టన్నుల ఎంఓపి , 15.16లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తున్నట్లు సర్కారు లెక్కలు చెబుతున్నాయి.