అర్థరాత్రి భార్యతో కొట్లాడి.. ఇంటికి నిప్పంటించాడు

అర్థరాత్రి భార్యతో కొట్లాడి.. ఇంటికి నిప్పంటించాడు

హైదరాబాద్: అత్తాపూర్ ఔట్ పోస్ట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్యతో కొట్లాడిన భర్త క్షణికావేశంలో ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హఠాత్ పరిణామంతో భార్య తేరుకునేలోపే ఇంట్లోని వస్తువులు, బట్టలు అన్నీ తగలబడిపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అత్తాపూర్ ఔట్ పోస్టు పరిధిలోని కాలనీలో మస్తాన్, సమీరా దంపతులు నివసిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి భార్యాభర్తల మద్య స్వల్ప వివాదం తలెత్తింది. చివరకు ఘర్షణకు దారితీసింది. కోపోద్రికుడైన భర్త మస్తాన్ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

భార్య సమీరా నిలువరించేందుకు విఫలయత్నం చేసింది. ఇంట్లో వున్న విలువైన వస్తువులు, బట్టలు,  సామాగ్రి పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో భార్య సమీరా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త మస్తాన్ అర్ధరాత్రి అకారణంగా తనతో గొడవ పడి.. కోపంతో ఇంట్లో పెట్రోల్ పోసి తగల బెట్టాడంటూ ఫిర్యాదు లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.