హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు బల్దియా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ల పనులు స్లోగా నడుస్తున్నాయి. మెయిన్ రోడ్లపై ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఎక్కువయ్యాయి. ఆఫీసులకు, వివిధ పనులపై వెళ్లే వాహనదారులు గంటల కొద్దీ ఇబ్బందులు పడుతున్నారు. సడన్గా ట్రాఫిక్ను మళ్లిస్తుండగా ఎప్పుడు ఏ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ల పనుల కోసం రోడ్లను తవ్వి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదాలు కామన్ అయ్యాయి. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల వ్యాపారులకు బిజినెస్లు సరిగా నడవడం లేదు. కరోనాతో దెబ్బతిని ఇప్పుడే పుంజుకుంటుండగా ఫ్లై ఓవర్ల పనుల్లో లేట్ కారణం గా మరింత నష్టపోతున్నామని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బల్దియా బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు స్పీడ్గా కొనసాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఎనిమిది చోట్ల ఇదే పరిస్థితి
నాగోల్, షేక్పేట, సంతోష్నగర్ ఓవైసీ హాస్పిటల్ జంక్షన్, బహదుర్పురా, ఇందిరా పార్కు, నల్గొండ ఎక్స్ రోడ్, ఉప్పల్–మేడిపల్లి, బైరామల్గూడ ఏరియాల్లో కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ఇవన్ని ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మార్చిలోగా కంప్లీట్చేయాల్సి ఉంది. స్లోగా నడుస్తున్న పనులు చూస్తుంటే మరో ఏడాదిన్నర కాలం పట్టేలా ఉందని అధికారులే అంటున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. పిల్లర్ల పునాదులు, అప్రోచ్లు మాత్రమే కాంక్రీట్తో నిర్మిస్తారు. మిగతా అన్నీ బయటే తయారు చేసుకుని తీసుకొచ్చి బిగిస్తారు. ఈ పనులు కూడా బహదుర్పురా, వీఎస్టీ, ఓవైసీ రూట్లో స్లో గా నడుస్తుండగా ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది.
రోడ్లన్నీ అధ్వానంగా..
ఫ్లై ఓవర్ పనులతో ఇందిరా పార్క్ నుంచి బాగ్లింగంపల్లి వరకు బైక్పై వెళ్తే పది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా ఇప్పుడు అరగంట పడుతుంది. బెంగళూరు, కర్నూలు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే బహదూర్ పురా రూట్కీలకం. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో పురానాపుల్నుంచి జూపార్క్ వరకు గంటల పాటు ట్రాఫిక్జామ్ అవుతుంది. ఉప్పల్– మేడిపల్లిలో రూట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నల్గొండ ఎక్స్రోడ్, బైరామల్గూడ లో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లై ఓవర్ల పనుల కారణంగా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. దుమ్ము, ధూళితో ముందు వెళ్తున్న వాహనం కనిపించడం లేదని వాహనాదారులు వాపోతున్నారు. సిటీలో ఎంటర్ అయ్యే ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది.
రోడ్డున పడ్డ వ్యాపారులు
సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల కారణంగా చాలామంది వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఆర్టీసీ క్రాస్రోడ్, బహదూర్పురా, ఓవైసీ జంక్షన్, నల్గొండ క్రాస్రోడ్లో బాటిల్నెక్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ స్లోగా వెళ్తుంది. దీంతో రోడ్లకు ఇరువైపులా వ్యాపారాలు జరగడం లేదు. షాపుల ముందు ఆగడానికి జాగా కూడా లేదు. దీంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు వేలల్లో కిరాయి కడ్తున్నామని, ఉదయం నుంచి రాత్రి వరకు ఐదు వందలు గిరాకీ కూడ కావడం లేదని వాపోతున్నారు. ఏడాదిన్నర నుంచి కరోనా దెబ్బతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు కుదుట పడ్తున్న సమయంలో ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులతో దెబ్బ పడుతోందని అంటున్నారు.
కిరాయి కట్టేందుకు అప్పు చేస్తున్నా..
పదిహేనేండ్లుగా షాపు పెట్టుకొని నెలకు పదివేలు కిరాయి కడ్తున్ననా. ఫ్లై ఓవర్కడుతుండగా రోడ్డును బ్లాక్ చేశారు. కరోనాతో ఏడాది కాలంగా నష్టపోయాం. ఇప్పుడిప్పుడే గిరాకి పెరుగుతుండగా రోడ్డును బ్లాక్ చేయడంతో బిజినెస్లు నడవట్లేదు. కిరాయి కట్టేందుకు అప్పులు చేస్తున్నా. ‑ బాబురావు, ఆర్టీసీ క్రాస్రోడ్
సడన్గా ట్రాఫిక్ డైవర్ట్ చేయగా..
రోజూ ఇందిరాపార్క్ వద్ద ఓ ఇనిస్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసులు చెప్తా. బైక్పై ఆర్టీసీ క్రాస్రోడ్ మీదుగా వెళ్తుంటా. సడన్గా ట్రాఫిక్ను డ్రైవర్ట్ చేసి, బారికేడ్లు పెట్టారు. అటు ఎక్కడ్నుంచి వెళ్లాలో తెలిపే బోర్డులు కూడా పెట్టలేదు. ‑ రవి, దిల్సుఖ్నగర్
సడన్గా ట్రాఫిక్ డైవర్షన్
ఫ్లైఓవర్ల నిర్మాణాలు స్పీడ్గా సాగట్లేదు. చిన్న కారణాలతో పనులు లేట్అవుతున్నాయి. ఆయా రూట్లలో ప్రయాణించే తిరిగే వారికి ప్రత్యామ్నాయ రూట్లు చూపకుండానే సడెన్గా ట్రాఫిక్ను డైవర్షన్ చేస్తుండగా, తెలియక వెళ్లే వాహనదారులు ట్రాఫిక్జామ్లో ఇరుక్కుంటున్నారు. సిటీ బస్సుల రూట్లుకూడా మారిపోయాయి. ట్రాఫిక్ రద్దీ ఉంటుండగా ఆఫీసర్లు ముందుగానే అలర్ట్ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ రూట్లో ఏర్పాటు చేయకపోవడం పాటు నిర్మాణ పనులు చేస్తున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్తున్నారు.