- ఏకంగా 20కోట్ల ఫోన్లు ఫిష్ మెంట్ జరుగుతుందని అంచనా
- పెరగనున్న 5జీ ఫోన్ల అమ్మకాలు
- 5జీని టాప్ ప్రయారిటీగా చూస్తున్న కంపెనీలు, వినియోగదారులు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరతతో ఈ ఏడాది ఇబ్బంది పడిన స్మార్ట్ఫోన్ మార్కెట్, కొత్త ఏడాదిలో దూసుకుపోతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కరోనా ఒమిక్రాన్ వలన కొన్ని అడ్డంకులు ఏర్పడినా వచ్చే ఏడాది ఫోన్ల అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా 5జీ ఫోన్లకు ఫుల్ గిరాకి ఉంటుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల నుంచి చూస్తే దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం బాగా పెరిగింది. 2019 లో ఏకంగా 15.8 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ జరిగింది. కరోనా సంక్షోభం, సెమీకండక్టర్ల కొరత వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది 16.8 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ జరగడం విశేషం.
ఇంకా డిమాండ్కు తగ్గ సప్లయ్ జరగడం లేదనేది గుర్తుంచుకోవాలి. కన్జూమర్లను ఆకర్షించడానికి కంపెనీలు 5 జీ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నాయి. దీంతో వీటి షిప్మెంట్లు కూడా కొత్త సంవత్సరంలో పెరుగుతాయని అంచనా. కరోనా సంక్షోభం వలన ప్రజలు ఇండ్లలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం వెబ్సిరీస్లు, రీల్స్ వంటి షార్ట్వీడియో కంటెంట్లు, సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. సప్లయ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఎనలిస్ట్ శిల్పి జైన్ అన్నారు. గత ఐదేళ్ల నుంచి దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ నిలకడగా పెరుగుతోందని, 2019 లో ఏకంగా 15.8 కోట్ల షిప్మెంట్లు జరిగాయని గుర్తు చేశారు.
‘కరోనా వలన స్మార్ట్ఫోన్ మార్కెట్ కొంత ఇబ్బంది పడడం చూశాం. ప్రస్తుతం ఈ మార్కెట్ గ్రోత్ బాట పట్టింది. దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ సామర్ధ్యం గురించి రానున్న ఏళ్లలో తెలుస్తుంది. 2022లో 20 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ జరుగుతుంది’ అని శిల్పి జైన్ అంచనావేశారు. గ్లోబల్గా సెమీకండక్టర్ల షార్టేజ్ రావడంతో ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొంత నష్టపోయిందని, ఫెస్టివ్ సీజన్ టైమ్లో స్మార్ట్ఫోన్ల సప్లయ్ కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. కొత్త ఏడాదిలో కూడా సెమీకండక్టర్ల షార్టేజ్ కొనసాగొచ్చని అన్నారు. కానీ, 2022 చివరి ఆరు నెలల్లో పరిస్థితులు మెరుగుపడొచ్చని చెప్పారు.
6.4 కోట్లకు 5జీ స్మార్ట్ఫోన్లు..
కొత్త సంవత్సరంలో 18.7–19 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ జరుగుతుందని సైబర్మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఎనలిస్ట్ ఆనంద్ ప్రియా సింగ్ అంచనావేశారు. 5జీ ఫోన్ల షిప్మెంట్ ఈ ఏడాదితో పోలిస్తే 2022లో 129 శాతం పెరుగుతాయని చెప్పారు. ఈ ఏడాది 2.8 కోట్ల 5జీ ఫోన్ల షిప్మెంట్ జరిగిందని, వచ్చే ఏడాది ఈ నెంబర్ 6.4 కోట్లకు చేరుకుంటుందని అంచనావేశారు. 2020 లో 15 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ జరిగిందని, ఈ ఏడాది ఈ నెంబర్ 11 శాతం పెరిగి 16.8 కోట్లకు చేరుకుందని ఆమె అన్నారు. దేశంలో 5జీ నెట్వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
అయినప్పటికీ, 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు పెరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2020 ప్రారంభం నుంచి 5జీ స్మార్ట్ఫోన్లను కంపెనీలు తీసుకురావడం స్టార్ట్ చేశాయి. కన్జూమర్లు కూడా స్మార్ట్ఫోన్లను కొనేటప్పుడు 5జీకి ప్రయారిటీ ఇస్తున్నారు. ‘‘కొత్త ఏడాది చివరి ఆరు నెలల్లో 5జీ స్పెక్ట్రమ్ ఆక్షన్ జరగనుంది. రానున్న ఏళ్లలో 5జీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నాం. ధర రూ. 15 వేల కంటే ఎక్కువున్న ఫోన్లను 5జీతో తీసుకొస్తున్నాం. రూ. 10 వేల లోపు ఉన్న స్మార్ట్ఫోన్లను 5జీ తో తేవాలని చూస్తున్నాం’ అని రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ షెత్ అన్నారు. గత రెండేళ్ల నుంచి చిప్సెట్లు, బ్యాటరీలు, మెమరీ చిప్లు వంటి స్మార్ట్ఫోన్ కాంపోనెంట్ల రేట్లు పెరుగుతూ వస్తున్నాయని షావోమి ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు రెడ్డి పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ఫోన్ల రేట్లు పెరుగుతున్నాయని అన్నారు. రేట్లు పెరిగినప్పటికీ, దేశంలో స్మార్ట్ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉందని అన్నారు. ఈ డిమాండ్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, సెమీకండక్టర్ల షార్టేజ్ వలన ఈ ఏడాది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల రేట్లు 20 శాతం పెరిగాయని అంచనా. మరోవైపు స్మార్ట్ టీవీలు, ఇయర్బడ్స్ వంటి ప్రొడక్ట్లకు కూడా ఫుల్గా డిమాండ్ ఉంది. ప్రస్తుతం టీవీ మార్కెట్లో స్మార్ట్ టీవీల వాటా 85 శాతంగా ఉంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా.
ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ పెరిగాయ్
కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆన్లైన్ ద్వారా జరిగే స్మార్ట్ఫోన్ అమ్మకాలు (రిటైల్) 29 శాతం పెరిగాయని జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకటించింది. అదే ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా జరిగిన సేల్స్ 4 శాతం మాత్రమే పెరిగాయని వివరించింది. రూ.30 నుంచి 40 వేల మధ్య అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 56 శాతం పెరిగాయని జీఎఫ్కే ప్రకటించింది.
రూ. 40 వేలకు పైన దొరికే స్మార్ట్ఫోన్ల సేల్స్ కూడా 41 శాతం మేర పెరిగాయని తెలిపింది. దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫోన్లకు గిరాకి పెరుగుతోందని వివరించింది. చిన్న పట్టణాల్లో కూడా స్మార్ట్ఫోన్ అమ్మకాలు పెరుగుతున్నాయని పేర్కొంది. జనాభా 50 వేలు కంటే తక్కువగా ఉన్న టైర్ 5 సిటీలలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 11 శాతం పెరిగాయని, టైర్ 3 సిటీలలో 7 శాతం పెరిగాయని వివరించింది.