హైదరాబాద్ లో లక్షన్నర విగ్రహాలు నిమజ్జనం

 హైదరాబాద్ లో లక్షన్నర విగ్రహాలు నిమజ్జనం
  •  24 గంటల పాటు లేక్​ క్లీనింగ్​
  •  హైదరాబాద్ ​ఇన్​చార్జి మంత్రి పొన్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో నిమజ్జనోత్సవానికి వివిధ శాఖలను సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని హైదరాబాద్​ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ చెప్పారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి పరిశీలించారు. 

మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం వరకు లక్షా 50 వేల విగ్రహాలు నిమజ్జనమైనట్టు తెలిపారు. హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రేన్లు, ఒక బాహుబలి క్రేన్‌‌ సిద్ధం చేశామన్నారు. 30 వేల మంది పోలీసులు, షీ టీంలు, సీసీ కెమెరాలతో గట్టి బందోబస్తు ఉందన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్‌‌లు, 269 మొబైల్ క్రేన్‌‌లతో నిమజ్జన ఏర్పాట్లు చేశామన్నారు. 200 మంది స్విమ్మర్‌‌లు, 15 వేల మంది శానిటేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు, 24 గంటలపాటు లేక్ క్లీనింగ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

40 గంటల పాటు కొనసాగొచ్చు

బషీర్​బాగ్​, వెలుగు: నేటి నిమజ్జనం సుమారు 40 గంటల పాటు కొనసాగవచ్చని సిటీ సీపీ సీవీ ఆనంద్​తెలిపారు. ట్యాంక్ బండ్ లో 50 వేల విగ్రహాల నిమజ్జనం జరగవచ్చన్నారు. 29 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉంటారన్నారు. నిమజ్జన మార్గాలను మానిటరింగ్​చేయడానికి రెగ్యులర్​సీసీ కెమెరాలతో పాటుగా అదనంగా 250 సీసీ కెమెరాలు , ఆరు డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. 160 యాక్షన్ టీమ్స్, 13 కంట్రోల్ రూమ్స్, 228 పికెట్ ఏరియాలను ఏర్పాటు చేశామన్నారు.  

ఆకతాయిల ఆట కట్టించడానికి 15 షీ టీమ్స్ నిఘా వేశాయన్నారు. గత ఏడాది డీజేలతో చాలా మంది చనిపోయారని, అందుకే ఈసారి డీజేలకు అనుమతి లేదన్నారు. ఖైరతాబాద్ గణేశ్​నిమజ్జనాన్ని మధ్యాహ్నం 1:30 గంటల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

రాత్రి వరకు 2 లక్షల విగ్రహాలు..

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి వరకు రికార్డు స్థాయిలో విగ్రహాలు నిమజ్జనమైనట్లు బల్దియా ప్రకటించింది. ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో  2,07,257 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. అత్యధికంగా ఎల్బీనగర్​జోన్​లో 33,047, చార్మినార్ లో 18,561, ఖైరతాబాద్ లో 38,212, శేరిలింగంపల్లిలో 35,325, కూకట్‌‌పల్లిలో 55,572, సికింద్రాబాద్ లో 26,540 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయి.

 హైదరాబాద్​ సిటీ, వెలుగు : హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో గణేశ్​ విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో  2,07,257 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఎల్బీనగర్​జోన్​లో 33,047, చార్మినార్ లో 18,561, ఖైరతాబాద్ లో 38,212, శేరిలింగంపల్లిలో 35,325, కూకట్‌‌పల్లిలో 55,572, సికింద్రాబాద్ లో 26,540 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయి.