ఎండాకాలంలో ఫ్యామిలీతో కలిసి చల్లగా ఉండే, మనసుకి హాయినిచ్చే ప్లేస్లకి వెళ్లాలని ఉంటుంది ఎవరికైనా. కానీ, కరోనా కారణంగా గత రెండేండ్లు ఎక్కడికీ టూర్ వేయలేదు చాలామంది. అయితే, చాలా దేశాలు కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో మళ్లీ టూరిస్ట్లు తమకు నచ్చిన ప్లేస్లు చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది వేసవి మొదలై నెల రోజులైనా కాలేదు ఇప్పటికే చాలామంది సమ్మర్ హాలిడే బుకింగ్స్ చేసుకున్నారట. వీళ్లలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం
టూరిస్ట్ ప్లేస్లని ఎంచుకున్నవాళ్లు కూడా ఉన్నారని అంటున్నారు ట్రావెల్ ఏజెంట్స్.
మనదేశంలో టూరిస్ట్లు కేరళ, ఊటీ, గోవా, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్లేస్లకు ‘క్యూ’ కడుతున్నారు. ఢిల్లీలో ఉండేవాళ్లు డెహ్రాడూన్, ముస్సోరీ, సిమ్లా, రిషికేష్లకి టూర్ వేస్తున్నారట. కొందరేమో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్, బెల్జియం చుట్టిరావడానికి బుకింగ్స్ చేసుకున్నారు. వీసా ఉన్నవాళ్లు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా చూసేందుకు పోతున్నారు. పోయిన ఏడాది జనవరితో పోలిస్తే... ఈ దేశాలకు 60 శాతం ఫ్లయిట్ బుకింగ్స్ అయ్యాయి. యుఎఇ, మాల్దీవులకు ఈ నెలలో రావాల్సిన వాళ్లలో 80 శాతం మంది టూరిస్ట్లు వచ్చారు. ట్రావెల్ బుకింగ్స్ పదిశాతం, హోటళ్లలో గదుల కిరాయి 35 శాతం పెరిగాయట. అంటే పోయిన ఏడాది రూ.2500 ఉన్న హోటల్ రూమ్ అద్దె ఇప్పుడు 7500 రూపాయలు అయింది. విమాన ఛార్జీలు కూడా 20–25 శాతం పెరిగాయి. హాలిడే ప్యాకేజీలు, ఫ్లయిట్ టికెట్లు, హోటళ్లు దాదాపు ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి అంటున్నారు ఏజెంట్లు.
గత రెండేండ్లలో లేనంతగా
‘‘టూరిస్ట్లు ఇంతలా రావడం 2019లో చూశాను. అయితే, ఈసారి అప్పటికంటే ఎక్కువ బిజినెస్ అవుతోంది. పోయిన నెలలో గత రెండేండ్లలో కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి” అని చెప్పాడు గురుగావ్కు చెందిన ఆర్గోసి ట్రావెల్స్ డైరెక్టర్ ఆకాశ్ రస్తోగి. ‘‘పోయిన ఏడాది మూడు నాలుగు ఫైళ్ల నిండా బుకింగ్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు యూరప్ బుక్సింగ్ కాపీలతో 18–20 ఫైళ్లు నిండుతున్నాయి. మనదేశంలోని టూరిస్ట్ ప్లేస్ల బుకింగ్స్, అక్కడి సౌకర్యాల గురించి అడిగే టూరిస్ట్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది” అంటోంది ఢిల్లీకి చెందిన ఆర్ఎన్ టూర్ అండ్ ట్రావెల్స్ కంపెనీ డైరెక్టర్ నేహా ప్రణయ్.