భైంసాలో పసిడి దగా..!..మోసపోతున్న వినియోగదారులు

భైంసాలో పసిడి దగా..!..మోసపోతున్న వినియోగదారులు
  • తనిఖీలకు దూరంగా సెంట్రల్​ఎక్సైజ్, ఇన్ కమ్​ట్యాక్స్​ శాఖలు

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా భైంసాలో బంగారు జీరో దందా విచ్చలవిడిగా సాగుతోంది. సరైన అనుమతులు లేకుండానే కొందరు వ్యాపారులు హోల్​సేల్ గా బంగారం అమ్ముతున్నారు. అభరణాల అమ్మకాల్లోనే వినియోగదారులను కొందరు మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వ్యాపారులు వినియోగదారులను మోసగిస్తున్నారు. 

అంతా జీరో దందానే..

ముథోల్​ నియోజకవర్గానికి ప్రధాన మార్కెట్​భైంసా పట్టణమే. మొత్తం వందకుపైగా దుకాణాలు ఉండడంతో నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు భైంసాలోనే బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి మార్కెట్​లో నిత్యం రూ.50 లక్షల వరకు బంగారం, వెండి క్రయ విక్రయాలు జరుగుతాయి. కాగా ఇక్కడ ఒకరిద్దరు మినహా మిగతా వ్యాపారులంతా జీరో దందానే కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

అనుమతులు లేకుండానే కొందరు హోల్​సేల్​లో​ బంగారం అమ్ముతున్నారు. మరికొందరు దుకాణదారులు వినియోగదారులు కొనుగోలు చేసే ఆభరణాలకు ఆన్​లైన్ పేమెంట్స్​​తీసుకోవడంలేదు. కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆన్​లైన్​పేమెంట్స్​తో ఐటీ సమస్యలు వస్తాయని ఇలా చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించే పన్ను ఎగవేస్తున్నారు. ఈ వ్యవహారమంతా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

తనిఖీలు లేవా?

నిర్మల్ ​జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​, బుధవార్ పేట్​ప్రాంతాల్లో శుక్రవారం పలు బంగారు దుకాణాలపై వాణిజ్య పన్నుల శాఖ, సెంట్రల్​ ఎక్సైజ్ ​అధికారులు ఐటీ దాడులు చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేశారు. అయితే జిల్లాలోనే ఎక్కువగా బంగారు వ్యాపారం సాగే భైంసాలో మాత్రం ఎలాంటి తనిఖీలు చేపట్టడంలేదు. 

బంగారం విషయంలో మోసపోయిన బాధితులు సెంట్రల్​ఎక్సైజ్, తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా తనిఖీలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.