
- వేగంగా పూర్తి చేయాలి: హరీశ్
హైదరాబాద్, వెలుగు: కరోనా తర్వాత ముందుచూపుతో నాలుగు టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ నిర్మించాలనుకున్నారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు ముందుకు కదలడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. టిమ్స్లతో పాటు వరంగల్ హెల్త్ సిటీ పనులనూ కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. అన్ని నిధులు కేటాయించి భూసేకరణ, టెండర్లు, డిజైన్లన్నింటినీ పూర్తి చేశారని పేర్కొన్నారు.
శనివారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఎల్బీ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎల్బీ నగర్ టిమ్స్లో సెల్లార్తో కలుపుకొని 6 అంతస్తుల భవనం పనులను బీఆర్ఎస్ పూర్తి చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఆసుపత్రి ఇప్పటికే ప్రారంభమై ఉండేదన్నారు. హైదరాబాద్ టిమ్స్ తో పాటు వరంగల్ హెల్త్ సిటీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో రాష్ట్రం వెనక్కు పోతున్నదని విమర్శించారు. కేసీఆర్ 450 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తే.. అందులో పనిచేసే డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఉద్యోగులకు ఆరు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలివ్వడం లేదని ఆరోపించారు.