
- భారీ వర్షం పడితే మెదక్లో పలు కాలనీలు జలమయం
- చెరువులా మారుతున్న మెయిన్ రోడ్డు
మెదక్, వెలుగు: భారీ వర్షం పడితే చాలు మెదక్ పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు వణికి పోతున్నారు. ఐదారు సెంటీమీటర్లకు మించి వర్షం పడితే చాలు పట్టణ పరిధిలోని సాయినగర్ కాలనీ, గాంధీనగర్ కాలనీ జలమయమవుతున్నాయి. పట్టణం మధ్యలో నుంచి వెళ్తున్న మహబూబ్నహర్ కాల్వ సాయినగర్ కాలనీని ముంచెత్తుతోంది.
దీంతో ఆ కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాల్వ నీరంతా సమీపంలోని ఆటోనగర్ కాలనీ మెయిన్ రోడ్డుపైకి చేరుతోంది. దీంతో ఆ రూట్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. రోడ్డు పక్కన ఉన్న షాప్లలోకి సైతం నీరు చేరుతోంది.
షాప్లలోకి నీరు..
భారీ వర్షం కురిసినప్పుడల్లా పట్టణంలో ప్రధాన రహదారి అయిన ఎంజీ రోడ్డు, రాందాస్ చౌరస్తా, ఫతేనగర్ రోడ్డు చెరువులా మారుతున్నాయి. ఎంజీ రోడ్డులో, మున్సిపల్ కాంప్లెక్స్ లో షాప్ ల లోకి నీరు చేరుతోంది. గడిచిన వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఈ పరిస్థితి నెలకొంది. షాప్లలోకి నీరు చేరడంతో సామగ్రి తడిసి పోయి నష్టం వాటిళ్లుతోందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కారణమేంటంటే..
పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కాలనీలు, రోడ్లు జలమయమవుతున్నాయి. సరైన లెవల్స్ తీసుకోకుండా ఇష్టారీతిగా డ్రైనేజీలు నిర్మించడం, పలు చోట్ల వాటికి ఔట్లెట్స్లేకపోవడం, మెయిన్ రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు చెత్తా చెదారం డ్రైనేజీలోకి తోసేయడంతో మురుగు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి రోడ్లు జలమయం కావడానికి, షాప్లలోకి నీరు చేరడానికి కారణమవుతున్నాయి.
కలెక్టర్ పర్యవేక్షణ
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ రాజ్ఇటీవల పట్టణంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా పరిష్కార మార్గాలు అన్వేషించి తక్షణ సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. మురికి కాల్వల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.