Heavy Rains: ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు..28 మంది మృతి

Heavy Rains: ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు..28 మంది మృతి

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో రుతు పవనాల ఎఫెక్ట్​ తో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, త్రిపుర మిజోరాం, నాగాలాండ్​ లలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి పదిమంది చనిపోయారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. ఈరాష్ట్రాల్లో 8మంది చనిపోయారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాల కారణంగా సంభవించిన విపత్తులలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో గౌహతి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందారు. మేఘాలయలో ఇద్దరు, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో ఒక్కొక్కరు చొప్పున కొండచరియలు విరిగిపడటం, వరదనీటిలో మునిగిపోయి ఐదుగురు చనిపోయారు. 

అసోంలోని గౌహతిలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. శనివారం (మే31) అసోం పశ్చిమ ,దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. అసోంలోని లఖింపూర్‌తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. 

మేఘాలయలో కూడా భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి.  భారీ వర్షాలకు ముగ్గురు మృతి. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో వృద్ధురాలు, మైనర్ సహా ముగ్గురు మృతిచెందారు. 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సాధారణ జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. మిజోరాంలో  భారీ వర్షం కారణంగా 5 ఇళ్లు, హోటల్ కూలిపోవడంతో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. లాంగ్ట్లైలోని బజార్ వెంగ్ ,చాంద్మేరి ప్రాంతాల సరిహద్దు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇళ్ళు ,హోటల్‌ను ధ్వంసమైంది. హోటల్‌లో బస చేసిన మయన్మార్‌కు చెందిన అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

కేరళలో వర్షాలకు ఏడుగురు మృతి, ముగ్గురు గల్లంతు 

కేరళలో నైరుతి రుతుపవనాలతో కురిసిన భారీ వర్షాలకు ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరో రెండు రోజులు భారీ వర్షాలున్నందుకు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది. తిరువనంతపురం జిల్లాలో రెండు ఫిషింగ్ బోట్లలో సముద్రంలోకి వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతయినట్లు తెలుస్తోంది. వారిని వెదికేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 

కర్ణాటకలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. బెలందూర్ లో అత్యధికంగా 48 సె.మీల వర్షపాతం నమోదైంది. మే 30న కర్ణాటకలో భారీవర్షాలు విధ్వసం సృష్టించాయి. మే 31న తీరప్రాంత కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వర్షాల తీవ్రత తగ్గింది.