
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మత్స్యకారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా చేపడుతున్న పర్సన్ ఇన్చార్జ్ల నియామకం తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. మత్స్యకారుల సహకార సంఘాలకు చీఫ్ ప్రమోటర్లు, పర్సన్ ఇన్చార్జ్ల నియామకం కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ బి.మల్లేశం మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.ఎల్.పాండు వాదిస్తూ..మత్స్యకారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్చార్జ్లను నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇది హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ జీవోను రద్దు చేసి తక్షణం ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.