
హైదరాబాద్, వెలుగు: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ కర్నాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది.
ఈ తీర్పును గాలి జనార్దన్రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేయకపోతే కర్నాటకలో తన శాసన సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గాలి జనార్దన్రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఓఎంపీ డైరెక్టర్లు ఇద్దరూ జైలులో ఉంటే కంపెనీ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఓఎంసీ కంపెనీ వాదించింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. మధ్యంతర అభ్యర్థనలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది.