శ్రావణమాసం సోమవారం శివుడిని ఇలా పూజిస్తే.. శివపార్వతులు ఆశీర్వదిస్తారట..

శ్రావణమాసం సోమవారం  శివుడిని  ఇలా పూజిస్తే.. శివపార్వతులు ఆశీర్వదిస్తారట..

తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం కొనసాగుతోంది.ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆ పరమ శివునికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.  శ్రావణ మాసం(Shravan month) శివుడు మరియు తల్లి పార్వతికి అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన మాసంలో భోలేనాథ్‌ను(Lord shiva) ప్రసన్నం చేసుకోవడానికి, శివ భక్తులు శివాలయంలో శివుని పూజిస్తారు.   శ్రావణ సోమవారం శివుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణమాసంలో వచ్చే ప్రతిసోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముక్తిప్రధాత ముక్కంటి శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైంది. ఈరోజు శివుడిని పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ దేవదేవుడిని అభిషేకాలు, అర్చనలతో ప్రార్థిస్తే...శుభాలు కలిగి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతుంటారు.  పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసం సోమవారం రోజున  సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శ్రావణమాసం సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. అంతే కాకుండా శివలింగానికి జలాభిషేకం కూడా చేస్తారు.  ఇలా చేస్తే శివపార్వతులు ఆశీర్వదిస్తారని శివపురాణంలో ఉందని వేద పండితులు చెబుతున్నారు. 

 అభిషేకం ఎలా  చేయాలి 

సూర్యోదయానికి ముందే నిద్రలేచి...స్నానమాచరించి శివాలయాలను దర్శించుకోవాలి. శివుడికి పాలు లేదా గంగా నీళ్లతో అభిషేకం చేసి, బిల్వపత్రం, విభూది సమర్పించాలి.  అనంతరం ఓం నమఃశివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. మీకు తోచిన మేరకు పేదలకు దానం చేయాలి. ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచిఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.  

సోమవారం శివ భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ఉపవాస దీక్షలతో స్వామివారి పూజలో పాల్గొంటారు.ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తులు ఉపవాసంతో ఆలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే అభిషేక ప్రియుడు అయినటువంటి పరమశివుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మనకు ఆరోగ్యం సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

మనసులో ఉన్న బలమైన కోరికను నెరవేర్చుకోవడానికి తాపత్రయపడేవారు.. శివలింగానికి నీటితో పాటు చెరకు రసాన్ని సమర్పించాలని పురోహితులు చెబుతున్నారు. శివాలయానికి వెళ్లి ఉత్తరాభిముఖంగా శివ లింగం ముందు కూర్చోని... . మనస్సులో లేదా బయటకు వినిపించేలా ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ చెరకు రసం కలిపిన నీటితో లింగానికి జలాభిషేకం చేయాలి. ఆ తర్వాత చేతులు జోడించి పరమేశ్వరుడికి మొక్కాలి. మనసులో ఉన్న కోరికను తలచుకుని అది నెరవేర్చమని ప్రార్థిస్తే  కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.రుణబాధలు, కష్టాలలో ఉన్నవారు స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల కష్టాల నుంచి బయట పడవచ్చని పండితులు చెబుతున్నారు.   సంతానం కోసం తపించేవారు పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తూ పూజలు చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

ఈ విధంగా స్వామివారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో పూజించాలి.ఈ క్రమంలోనే శివుడికి సహస్ర నామాలను చదువుతూ పాలలో చక్కెర కలిపి వాటితో అభిషేకం చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందని బ్రాహ్మణులు చెబుతున్నారు.పూజ అనంతరం స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటివి సగ్గుబియ్యంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుందంటున్నారు.ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజలు చేయటం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు. 

శివపార్వతుల అనుగ్రహం కలగాలంటే... 

శ్రావణమాసంలో శివపార్వతుల అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. భక్తులు తాము చేసిన తప్పులను మన్నించమని మనస్పూర్తిగా ఆ శివయ్యను ప్రార్ధించినట్లయితే...జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారని పురాణాలు చెబుతున్నాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులన్నీ సానుకూలంగా జరుగుతాయట.  ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే అదృష్టం కలిసి వస్తుందని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు పలు వేదికల్లో చెప్పారు.