హైదరాబాద్ సిటీలో క్రైమ్ రేట్ 17 శాతం తగ్గింది

హైదరాబాద్  సిటీలో క్రైమ్ రేట్ 17 శాతం తగ్గింది
  • పోలీస్ కమిషనర్​ సీవీ ఆనంద్​
  • పోలీసుల సమష్టి కృషి వల్లే     సాధ్యమైంది
  • కమిషనరేట్​లో క్రైమ్ రివ్యూ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ కమిషనరేట్​పరిధిలో 2024 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్​వరకు 31,533 కేసులు నమోదయ్యాయని, 2023తో పోలిస్తే ఈసారి17 శాతం క్రైమ్​రేట్​తగ్గిందని సిటీ పోలీస్​కమిషనర్​సీవీ ఆనంద్​తెలిపారు. గతేడాది 38,206 కేసులు ఫైల్ అయ్యాయన్నారు. ఆదివారం ఆయన అన్ని జోన్ల డీసీపీలతో, వివిధ వింగ్​ల ఉన్నతాధికాలు, పోలీసు సిబ్బందితో క్రైమ్​రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిటీలోని పోలీసులు సమిష్టిగా, సమన్వయంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సెప్టెంబర్​2023 నుంచి ఆగస్టు 2024 వరకు 85 హత్యలు జరగ్గా, 2024 సెప్టెంబర్​నుంచి 2025 ఆగస్టు వరకు 73 మర్డర్లు జరిగాయన్నారు. ఇందులో 14 శాతం తగ్గుదల ఉందన్నారు. హత్యాయత్నాలు గతేడాది 259, ఈసారి185, కిడ్నాప్​లు గతేడాది  698, ఈసారి 616 జరిగాయన్నారు.  

గతేడాది సైబర్​క్రైమ్స్​కేసులు 4,348 నమోదు కాగా, ఈసారి 3,745 మాత్రమే ఫైల్​అయ్యాయన్నారు. అన్ని రకాల దోపీడీలు గతేడాది 701 జరగ్గా, ఈసారి 578 నమోదయ్యాయన్నారు. దొంగతనాలు   గతేడాది 4,778 కాగా, ఈసారి 3,501 జరిగాయన్నారు.  మహిళలపై నేరాలకు సంబంధించి 2023–---24లో లైంగికదాడులు 632 జరగ్గా, ఈఏడాది అది 485కు కాగా  23శాతం తగ్గుదల కనిపించిందన్నారు. అప్పుడు కిడ్నాప్​లు 265, ఇప్పుడు 239.. వేధింపుల కేసులు గతేడాది 1,358 ఇప్పుడు 1,351 నమోదయ్యాయన్నారు. 

అడిషనల్​ సీపీలు విక్రం సింగ్ మాన్, పి. విశ్వ ప్రసాద్, జాయింట్​సీపీలు డి. జోయెల్ డేవిస్, పరిమళ హనా నూతన్, డీసీపీలు ఎన్. శ్వేత, కె. శిల్పవల్లి,  విజయ్ కుమార్, ఎస్.రష్మి పెరుమాళ్, బాలస్వామి, స్నేహ మెహ్రా, అపూర్వ రావు, రాహుల్ హెడ్గే, ఆర్. వెంకటేశ్వర్లు, కవిత, లావణ్య నాయక్ జాదవ్, చంద్రమోహన్, చైతన్య కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.