
- 25 కంపెనీలపై ఫిర్యాదులు
- రికార్డుల్లో లేని మూసీ సరిహద్దులు
- గుర్తింపుపై నిపుణులతో కమిషనర్చర్చ
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీని బడా కంపెనీలు ఆక్రమిస్తున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఇలాంటి ఫిర్యాదులు 25 వరకు రావడం, మూసీకి సంబంధించి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో ఆక్రమణలను ఎలా అడ్డుకోవాలనే దానిపై నిపుణులతో శుక్రవారం హైడ్రా చీఫ్చర్చించారు. ‘మూసీనది సరిహద్దు గుర్తింపు, ఓఆర్ఆర్ లోపల నాలా నెట్వర్క్స్తో పాటు వెడల్పు నిర్ధారణ’ అనే అంశంపై సదస్సు సాగింది. మూసీ సరిహద్దుల నిర్ధారణ ఎలా చేపట్టాలనే విషయంపై చర్చించారు.
చెరువుల ఎఫ్టీఎల్ను గుర్తించిన విధంగానే మూసీ నది ఎంఎఫ్ఎల్( మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్)ను గుర్తించేందుకు గ్రామ, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్ధారించాలని కొంతమంది నిపుణులు సూచించారు. మూసీ పరివాహక ప్రాంతం హైడ్రాలజీ నివేదికలు, ఎన్ఆర్ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలు, సర్వే ఆఫ్ ఇండియా రికార్దులను కూడా పరిశీలించి హద్దులను నిర్ధారించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని పలువురు హైడ్రాకు సూచించారు.
సిటీలో 1908, 1954, 2000, 2008 సంవత్సరాలలో కురిసిన భారీ వర్షాలు, అప్పటి పరిణామాలను చర్చించి మూసీ నదీ పరీవాహకంలో ఎక్కడ ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ, కేవలం బడా కంపెనీలు మూసీని ఆక్రమించారని వస్తున్న ఫిర్యాదులపైన మాత్రమే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, నగరంలో నాలాలు కుంచించుకుపోకుండా చూడాలని పలువురు నిపుణులు సూచించారు.
బల్దియా పరిధిలో 940 ప్రాంతాల్లో కల్వర్టులు ఉన్నాయని, అక్కడ చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు సాధారణంగా వెళ్లడంలేదని అన్నారు. పలు చోట్ల నాలాల లింక్కట్ అయ్యాయని, దానిని పునరుద్ధరించాలన్నారు. కొన్ని చోట్ల కుంచించుకుపోయాయని, అక్కడ నిర్మాణాలకు ఎలాంటి ముప్పు లేకుండానే కుదిరితే విస్తరణ లేదంటే మళ్లింపు చేయాలని సూచించారు. నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినప్పడు రోడ్ల వెడల్పు విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నామో, నాలాల నిర్మాణంలో కూడా అదే పాటించాలని సూచించారు. రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా, ఇరిగేషన్, హైడ్రాలజీ, ఎస్ ఎన్డీపీ, ఎన్ఆర్ ఎస్సీ, జీహెచ్ఎంసీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు అర్బన్ డెవలప్మెంట్లో భాగస్వామ్యమవుతున్న పలు సంస్థలకు చెందిన నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.