ఇపో (మలేసియా): అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో 2–3తో బెల్జియం చేతిలో ఓడింది. ఇండియా తరఫున అభిషేక్ (33వ ని), శీలానంద్ లక్రా (57వ ని) గోల్స్ చేయగా, రోమన్ దువెకోట్ (17, 57వ ని), నికోలస్ డి కెర్పెల్ (45వ ని) బెల్జియంకు గోల్స్ అందించారు.
షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ సోమవారం జరగాల్సి ఉన్నా భారీ వర్షం కారణంగా వాయిదా పడింది. స్టార్టింగ్ నుంచి దూకుడుగా ఆడిన ఇండియా మ్యాచ్ మధ్యలో బెల్జియం ఎదురుదాడులను అడ్డుకోలేకపోయింది. తొలి 10 నిమిషాల్లోనే బెల్జియంకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఇండియా డిఫెన్స్ సమర్థంగా తిప్పి కొట్టింది.
అయితే 17వ నిమిషంలో రోమన్ డ్రిబ్లింగ్తో గోల్ కొట్టి బెల్జియంను ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత ఇండియా అప్రమత్తంగా ఆడినా చివర్లో గోల్స్ ఇచ్చుకుంది. బుధవారం జరిగే మ్యాచ్లో ఇండియా.. మలేసియాతో తలపడుతుంది.
