చేపలవేటకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఇండియన్ నేవీ సిబ్బంది రక్షించారు. చేపల వేటకు వెళ్లి రెండు రోజుల పాటు సముద్రంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులను INS ఖంజర్ సాయంతో 30 గంటలపాటు శ్రమించి ఒడ్డుకు చేర్చారు.
తమిళనాడులోని నాగపట్టణం తీరం నుంచి 36 మంది మత్స్యకారులు మూడు పడవల్లో చేపల వేట కోసం వెళ్లారు. అయితే వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో పాటు ఫ్యూయల్ అయిపోయింది. దీనికి తోడు పడవల్లో ఇంజిన్ సమస్య తలెత్తడంతో సముద్రం మధ్యలోనే పడవలు నిలిచిపోయాయి. రెండు రోజుల పాటు మత్స్యకారులంతా బంగాళాఖాతంతోనే చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత నౌకాదళం..బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఎన్ఐఎస్ ఖంజర్ను సహాయక చర్యలకు పంపింది. మత్స్యకారుల కోసం భారత నౌకాదళ సిబ్బంది గాలించారు. తమిళనాడు తీరానికి దాదాపు 130 నాటికల్ మైళ్ల దూరంలో మూడు పడవలు కన్పించాయి. దీంతో మత్స్యకారుల బోట్లకు తాళ్లు కట్టి 30 గంటలకు పైగా లాక్కుంటూ చెన్నై హార్బర్కు తీసుకొచ్చారు.