
- అంతరిక్షంలోకి రోబో వ్యోమమిత్రను పంపిస్తం: ఇస్రో చైర్మన్
- క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీలో పురోగతి సాధించామని వెల్లడి
- మనం త్వరలో సొంత రాకెట్లో స్పేస్లోకి వెళ్తాం: శుభాంశ్ శుక్లా
న్యూఢిల్లీ: మన దేశం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్పై ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మిషన్కు సర్వం సిద్ధమైందని ఆయన తెలిపారు. గగన్యాన్ టెస్టు మిషన్ను ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టనున్నట్టు ప్రకటించారు. ‘‘ఈ ఏడాది చివర్లో గగన్యాన్ 1 మిషన్ చేపట్టనున్నాం. ఇందులో భాగంగా హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపిస్తాం. ఇది డిసెంబర్లో చేపట్టే అవకాశం ఉంది” అని వెల్లడించారు.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, గగన్యాన్ మిషన్కు ఎంపికైన ఆస్ట్రోనాట్లు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బి నాయర్తో కలిసి గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో నారాయణన్ మాట్లాడారు. క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీలో పురోగతి సాధించామని తెలిపారు. స్వదేశీ టెక్నాలజీకి సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రానున్న రెండు మూడు నెలల్లో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించనున్నట్టు వెల్లడించారు.
ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 శాటిలైట్లను స్పేస్లోకి పంపినట్టు వివరించారు. మనం త్వరలోనే మన సొంత రాకెట్లోనే అంతరిక్షంలోకి వెళ్లనున్నామని శుభాంశు శుక్లా తెలిపారు. ఐఎస్ఎస్ జర్నీ గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ‘‘యాక్సియం–4 మిషన్లో చాలా నేర్చుకున్నాను. అది గగన్యాన్ కు ఎంతో ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.