US టెక్సాస్ స్కూల్ లో గన్ ఫైర్..18 మంది స్టూడెంట్స్ మృతి

US టెక్సాస్ స్కూల్ లో గన్ ఫైర్..18 మంది స్టూడెంట్స్ మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు  కలకలం రేపాయి. టెక్సాస్ లోని ఎలిమెంటరీ స్కూల్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు. మొత్తం 21 మంది కాల్పులకు బలయ్యారు. 2012 తర్వాత స్కూళ్లలో ఈ స్థాయిలో ఫైరింగ్ జరగడం ఇదే తొలిసారి. కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. అతడు కూడా స్పాట్ డెడ్ అయ్యాడు. ఒక్కసారిగా స్కూల్ లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 18 మంది పిల్లలు చనిపోయారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైరింగ్ గురించి తెలుసుకున్న పేరెంట్స్... స్కూల్ దగ్గరకు పరుగులు తీశారు. తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ దారుణ ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులను ఖండించారు. గన్ కల్చర్ పై ఇప్పటికైనా చర్యలు చేపట్టాల్సిన టైం వచ్చిందని చెప్పారు. చనిపోయిన స్టూడెంట్స్ వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉందని టెక్సాస్ పోలీసులు తెలిపారు. ఈ స్కూల్ లో మొత్తం 500 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. దుండగుడు తుపాకీతో రోబ్ ఎలిమెంటరీ స్కూళ్లోకి వెళ్లాడని చెప్పారు గవర్నర్ అబాట్. అతని దగ్గర రైఫిల్ కూడా ఉండొచ్చని అన్నారు. 2018 లో ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో జరిపిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ స్టూడెంట్లు, ముగ్గురు టీచర్లు చనిపోయారు. దాని తర్వాతే ఇదే అత్యంత దారుణ ఘటన అని చెప్తున్నారు అధికారులు. 2020 వ సంవత్సరం మొత్తంలో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19 వేల 350 మంది చనిపోయారు. ఇది 2019 తో పోలిస్తే 35 శాతం ఎక్కువని తెలిపింది సెంటర్స్ ఫర్ డసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. తాజాగా ఎలిమెంటరీ స్కూల్ ఫైరింగ్ తో అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.