
న్యూఢిల్లీ: అది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఇస్లాంనగర్ ప్రాంతం. ఆ ఏరియాలో తబారక్ లాడ్జి ఉంది. చూడడానికే అది లాడ్జిలా కనిపిస్తుంది. కానీ, లాడ్జి కింద బాంబు తయారీ జరుగుతోంది. ఐసిస్ టెర్రరిస్టుల కోసం బాంబులు తయారు చేస్తున్న అషర్ డానిష్ అనే విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. డానిష్ పదో తరగతి స్టూడెంట్. కానీ, ఐసిస్ ఉగ్ర సంస్థ కోసం బాంబులు తయారు చేస్తున్నాడు. ఇస్లాంనగర్ ఏరియాలోని ఓ మారుమూలన ఓ బిల్డింగ్ ను లాడ్జిగా నడుపుతున్నారు. దాని కింద బాంబులు తయారు చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ఖురేషీని అరెస్టు చేసి విచారించగా.. రాంచీలోని లాడ్జి కింద బాంబులు తయారు చేస్తున్న విషయాన్ని అతను బయటపెట్టాడు.
దీంతో జార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ తో కలిసి ఢిల్లీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి అషర్ డానిష్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ వారం రోజుల వ్యవధిలో మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లయింది. బీజేపీ నేతలనే టార్గెట్ గా చేసుకుని నిందితులు బాంబులు తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. డానిష్ నుంచి బాంబులు, గన్ పౌడర్, భారీ మొత్తంలో పొటాషియం నైట్రేట్, దేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తాము తయారు చేసిన బాంబులు, పేలుడు పదార్థాలకు సమీపంలోని సుబర్ నరేఖా నదిలో టెస్టులు చేశారు.