ముగిసిన 5జీ స్పెక్ట్రమ్  వేలం

ముగిసిన 5జీ స్పెక్ట్రమ్  వేలం

5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. లక్షా 50వేల 173 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 7 రోజుల పాటు 40 రౌండ్లలో జరిగిన బిడ్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. 5జీ వేలంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది. జియో తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ -ఐడియా ఉన్నాయి. 4జీ స్పెక్ట్రమ్  రూ.77వేల 815 కోట్లకు అమ్ముడుపోగా... 5జీకి దాదాపు రెట్టింపు మొత్తం వచ్చింది.

2010లో జరిగిన 3జీ స్పెక్ట్రమ్ .. 50వేల 968 కోట్లకు అమ్ముడైంది. కొత్తగా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ .. 26 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్  కోసం వేలంలోకి ప్రవేశించింది. అదానీ డేటా నెట్ వర్క్స్ లిమిటెడ్ 212 కోట్లు రూపాయలతో కొననుగోలు చేసింది. భారతీ ఎయిర్ టెల్ 43 వేల 84 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 88 వేల 78 కోట్లు, వొడాఫోన్ లిమిటెడ్ 18వేల 799 కోట్లు పెట్టాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

జియో, భారతీ ఎయిర్ టెల్  దేశమంతా 5జీ సేవలను విస్తరించాలని భావిస్తుండగా.. వొడాఫోన్ -ఐడియా మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం కానున్నట్లు సమాచారం. ఈనెల14 లోపు స్పెక్ట్రమ్ ను కేటాయించి, సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కేంద్రం మంత్రి అశ్విని వైష్ణమ్ తెలిపారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే  వీడియోలను సెకన్లలో డౌన్ లోడ్  చేసుకోవచ్చు.