కష్టకాలంలో దేశాన్ని సమర్థంగా నడిపిన పీవీ

కష్టకాలంలో దేశాన్ని  సమర్థంగా నడిపిన  పీవీ

పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921 లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి భారత రాజకీయాలలో దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు శాసనసభ్యునిగా, ముఖ్యమంత్రిగా, లోకసభ సభ్యుడిగా, కేంద్ర మత్రిగా, దేశానికి 9 వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశాడు. ఈ పదవి అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారత్ నుంచి ఎంపికైన అరుదైన నాయకుడాయన.  అందునా మన తెలంగాణ బిడ్డ.  కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించిన రాజకీయ చాణక్యుడు పీవీ.

పీవీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అచేతన స్థితిలో ఉంది. దీనికి తోడు దేశంలో రాజకీయ స్తబ్దత నెలకొన్నది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం పీవీ అనేక సంస్కరణలు ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా రూపాయి విలువ పతనం అయితే ఆర్థిక వ్యవస్థ కృంగిపోతుందని ఆందోళన చెందుతాం. కానీ మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వమే కరెన్సీ విలువను తగ్గించింది. నాడు ఆ షాక్ ట్రీట్మెంటు ద్వారా ఆర్థిక వ్యవస్థ కోలుకుంది.  

దేశం నిలదొక్కుకుంది

1991లో మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కేవలం బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.  విదేశీ అప్పులు కొండలా పేరుకుపోయాయి, దీనికి తోడు ద్రవ్యోల్బణం రెండు అంకెలకు చేరింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశం దివాలా అంచున వేలాడింది. ఈ సమయంలో దేశ ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదం చేశాయి. 

 ముఖ్యంగా 1991లో నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడం పీవీ చేసిన పెద్ద ఆర్థిక సంస్కరణ అని చెప్పవచ్చు.   ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతా రంగాలు మినహా అన్ని పరిశ్రమలలో ప్రైవేటు వ్యక్తులను పెట్టుబడులకు ఆహ్వానించడం, పన్నుల్లో సంస్కరణలు తేవడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి ఆర్థిక సంస్కరణల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం లభించింది.   తెలివితేటలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.. అనుకునే మూస పాలన పద్దతులు ఈ ఐదేళ్ల కాలంలో కనుమరుగై పోయాయి.

ఆర్థిక సంస్కరణలే కాకుండా తన రాజకీయ జీవితంలో అనేక సంస్కరణలను, పథకాలను రూపొందించారు. న్యాయశాఖ మంత్రిగా ఆరుబయట జైలును నెలకొల్పడం, ఆరోగ్య మంత్రిగా ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ పై వేటు వేయడం, దేవాదాయ శాఖ మంత్రిగా కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం, విద్యాశాఖ మంత్రిగా ఆదర్శ పబ్లిక్ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ పరిమితి చట్టాన్ని తీసుకువచ్చి తనకున్న వందలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేసి ఆదర్శంగా నిలిచారు. దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడానికి భారత ప్రతినిధిగా నాడు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అయిన అటల్ బిహారి వాజ్​పేయిని పంపి రాజకీయాలలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. 

అసమాన రాజనీతిజ్ఞత

కాశ్మీరు, పంజాబ్ లో ఎన్నికల నిర్వహణ ద్వారా ఉగ్రవాదానికి చెక్కు పెట్టగలిగిన చాణక్యం, ఇండియాను అణు శక్తి సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దడానికి సర్వం సిద్ధం చేసిన పౌరుషం, లుక్ ఈస్ట్   విధానం ద్వారా తూర్పు వాకిలి తెరిచిన చతురత పివి అసమాన రాజనీతిజ్ఞతకు తిరుగులేని ఆనవాళ్లు. 16 భాషలలో అనర్గళంగా మాట్లాడే బహు భాషావేత్త స్వయంగా అనేక పుస్తకాలు రచించిన గొప్ప రచయిత అయన.  

పీవీ 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు అనంతరం భారత ప్రభుత్వం ఆలస్యంగానైనా ఆయన మరణానంతరం2024 ఫిబ్రవరిలో భారత అత్యున్నత పురస్కారం  భారతరత్న  ఇచ్చి గౌరవించింది దేశం. మనకు ఏమి ఇవ్వదు దేశానికే మనం ఇవ్వాలనే సంకల్పంతో దాదాపు జీవితంలో సగభాగాన్ని ప్రజాసేవకై అంకితం చేసిన పీవీ లాంటి ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి.

‌‌‌‌‌‌‌‌- డా.చింత ఎల్లస్వామి,అసిస్టెంట్ ప్రొఫెసర్, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ-