
- మేడిగడ్డ డీపీఆర్ కోసం 2015లోనే కన్సల్టెన్సీని నియమించినగత బీఆర్ఎస్ ప్రభుత్వం
- 2016లో హరీశ్, తుమ్మల, ఈటలతో కేబినెట్ సబ్ కమిటీ
- సబ్కమిటీకి, కాళేశ్వరానికి సంబంధం లేదన్న తుమ్మల
- మంత్రి వాదనలకు బలం చేకూర్చేలా బయటకువచ్చిన ఆధారాలు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రులు తుమ్మల, ఈటల, హరీశ్రావుతో వేసిన కేబినెట్ సబ్కమిటీకి, కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదనేందుకు కావాల్సిన ఆధారాలు తాజాగా వెలుగుచూశాయి. మేడిగడ్డ డీపీఆర్ కోసం 2015లోనే కన్సల్టెన్సీని నియమించిన ప్రభుత్వం.. 2016లో హరీశ్, తుమ్మల, ఈటలతో కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు డాక్యుమెంట్లు బయటపడ్డాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం రాజుకున్నది. మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, ఇందుకు కేబినెట్ ఆమోదం కూడా ఉందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ ఎదుట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదే సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న మంత్రి తుమ్మల.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు. మంత్రుల సబ్ కమిటీకి, మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదని వెల్లడించారు. 2016లో వేసిన కేబినెట్సబ్కమిటీ కేవలం పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిందేనని చెప్పారు.
సబ్ కమిటీ ఏర్పాటుకు ముందే మేడిగడ్డకు పర్మిషన్లు
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 2016 మార్చి 1న పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. 2016, మార్చి 15న రీ ఇంజినీరింగ్ ఆఫ్ ప్రాజెక్టులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల ఆధారాలతో సహా బయటపెట్టారు. దీని ద్వారా మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు సబ్ కమిటీ నియామకానికి ముందే జరిగాయని స్పష్టమవుతున్నది.
అంటే మేడిగడ్డ నిర్మాణంపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకునే చాన్స్ లేదనే తుమ్మల వాదనకు బలం చేకూరుతున్నది. కమిషన్ ఎదుట హాజరైన అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్.. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), వ్యాప్కోస్ సూచించినందుకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించినట్లు కమిషన్ ఎదుట చెప్పారు. దీనికి విరుద్ధంగా 2015, ఏప్రిల్ 2న మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్ తయారు చేయాలని ఇరిగేషన్ విభాగం చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినట్లు ఆధారాలున్నాయి.
దీని ఆధారంగా 2015, ఏప్రిల్ 13న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు డీపీఆర్ తయారు చేసే బాధ్యతను కన్సల్టెన్సీ కంపెనీకి అప్పగిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిస్తూ జీవో ఇచ్చింది.
కన్సల్టెన్సీ సూచనల ఆధారంగా మేడిగడ్డ నిర్మించారనే దానికి.. ప్రభుత్వ ఉత్తర్వులకు పొంతన లేకపోవడం గమనార్హం. మేడిగడ్డ నిర్మించాలని ముందుగానే నిర్ణయించిన ప్రభుత్వం, అక్కడ డీపీఆర్ తయారీ చేసే బాధ్యతనే వ్యాప్కోస్కు అప్పగించిందని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే, సీడబ్ల్యూసీ లేదా వ్యాప్కోస్ సూచనల కంటే ముందే ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.