హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ట్రావెల్స్ ఆఫీసు సిబ్బంది.. కూకట్పల్లిలో కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు.
వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. శుక్రవారం ( అక్టోబ ర్ 24) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది.దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో 25 మంది సజీవదహనం అయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు.
►ALSO READ | కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం: బైకును 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు.. ఆయిల్ ట్యాంక్ పేలడంతో పూర్తిగా దగ్ధం..
సమాచారం అందుకున్న కూకట్ పల్లి ఆఫీసు సిబ్బంది.. కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుల్లో నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది.
