
ఢిల్లీ లిక్క్ స్కాంలో మనీష్ సిసోడియా కస్టడీని పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 17 వరకు పొడిగించింది కోర్టు. దర్యాప్తు కీలక దశలో ఉందని ఈడీ కోరడంతో కోర్టు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది.
మరో వైపు సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. మనీలాండరింగ్ నేరానికి సంబంధించినంతవరకు ఎటువంటి ఆరోపణలు లేవంటూ మనీష్ సిసోడియా తరపు న్యాయవాది వివేక్ జైన్ కోర్టుకు తెలిపారు. ఆయన ఇంటిపై దాడి చేసి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారని.. ఇంత వరకు మనీష్ సిసోడియా దగ్గర నేరానికి సంబంధించిన ఒక్క ఆధారం లభించలేదని కోర్టుకు తెలిపారు. పీఎంఎల్ఏ కేసు నమోదు కాలేదని.. సెక్షన్ 3 కింద నేరం జరిగితేనే పీఎంఎల్ఏ సెక్షన్ 45 వస్తుందన్నారు. మనీష్ సిసోడియా ఖాతాలో గానీ, అతని కుటుంబ సభ్యుల ఖాతాకి ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పారు.
ఈ కేసులో సాక్ష్యాలను , కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నామని.. బెయిల్ మంజూరు చేయొద్దని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేసింది.