
- కేటీఆర్పై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: సొంత చెల్లి కవితను బయటకు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు సుద్దపూసలా తెలంగాణ ఆడ బిడ్డల గురించి మాట్లాడడం ఏమిటని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మపై పాటలు రాసి.. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అమలు చేస్తున్నదోచెప్పినందుకు ఆ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు.
ఆడ బిడ్డలను గౌరవించని చరిత్ర బీఆర్ఎస్ది అని, ఐదేండ్లలో ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన ఆ పార్టీ.. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడితే తెలంగాణ ఆడపడుచులు నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ బతుకమ్మ కుంటను ఆక్రమిస్తే.. తమ ప్రభుత్వం అక్కడే బతుకమ్మ ఆటలను ఆడేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆట ఆడేందుకు బీఆర్ఎస్ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి రావాలని ఆమె ఆహ్వానించారు.