హైదరాబాద్, వెలుగు: కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తెలంగాణలోని వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి ఆలయం, ఏపీలోని అమరావతి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ద్రాక్షరామానికి టూర్ ప్యాకేజ్లు ఉన్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలోని ఆలయాలకు రాజధానికి రూ.2,400, సూపర్ లగ్జరీ రూ.1,900, ఎక్స్ ప్రెస్కు రూ. 1,500, ఏపీలోని ఆలయాలకు రాజధానికి రూ.4 వేలు, సూపర్ లగ్జరీ రూ.3,200ను టికెట్ ధరలుగా ఖరారు చేశామని వెల్లడించారు. దర్శనం టికెట్లు, స్నాన వసతికి రూ.550ను ముందుగానే చెల్లించాలన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో రద్దీ ఉంటుందని.. అందుకు అనుగుణంగా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలకు రిజర్వేషన్ కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లతో పాటు, ఆర్టీసీ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.