
- చామనపల్లి ఎస్సీ రైతులపై పోడు కేసులు నమోదు చేయడంపై సీరియస్
మంచిర్యాల, వెలుగు : వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై పోడు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం పట్ల మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. ఫారెస్ట్ ఆఫీసర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే... చామనపల్లి శివారులోని 65, 67 సర్వేనంబర్లలో భూములను స్థానిక రైతులు 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. 1997లో అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పాస్ బుక్స్ సైతం వచ్చాయి.
అయితే ఈ భూములు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందినవని గతేడాది నుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని బాధిత రైతులు సోమవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే జైపూర్ ఏసీపీ, నీల్వాయి ఎస్సైకి ఫోన్ చేసి ఘటనపై విచారణ జరిపి సంబంధిత ఆఫీసర్లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, నాయకులు మున్నారాజ్ సిసోడియా, దుర్గం ఎల్లయ్య, రైతులు బానయ్య, లింగయ్య, పర్వతాలు, మధుకర్ ఉన్నారు.