బీఆర్ఎస్​లో బాల్క సుమన్​ చిచ్చు

బీఆర్ఎస్​లో బాల్క సుమన్​ చిచ్చు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బీఆర్​ఎస్​లో చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ చిచ్చు మొదలైంది. తన ఒంటెత్తు పోకడలతో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వాళ్లను అగణదొక్కడానికి తెరవెనుక కుట్రలు చేస్తున్నారని, బాల్క సుమన్​తో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్​రావు, దుర్గం చిన్నయ్యలకు మధ్య గ్యాప్ ​పెరిగింది అందుకేనని గులాబీ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

 ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ హోదాలను అడ్డం పెట్టుకొని సుమన్​ వన్​మ్యాన్​ షో చేయడాన్ని  ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ ​మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని ఐదోసారి గెలవాలని దివాకర్​రావు, హ్యాట్రిక్ ​కొట్టాలని చిన్నయ్య భావిస్తున్నారు. ఈసారి వారికి చెక్ పెట్టేందుకు సుమన్​ పావులు కదుపుతున్నారంటూ వస్తున్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నూర్​ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్​కుమార్​లను రాజకీయంగా దెబ్బతీసిన సుమన్​ ఇప్పుడు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది.   

నాడు నల్లాలకు ద్రోహం..

ఇంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్​ కిందటి ఎన్నికల్లో చెన్నూర్​ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కన పెట్టించి ఆయన సీటు దక్కించుకోవడం తెలిసిందే. ఓదెలు నామినేటెడ్​ పోస్టును ఆశించగా ఆయన తిరిగి యాక్టివ్​ అయితే తనకు కష్టమని ఓదెలు భార్య భాగ్యలక్ష్మిని జడ్పీ చైర్​పర్సన్ ​కుర్చీలో కూర్చోబెట్టారు. తర్వాత వారిని అడుగడుగునా అవమానించడంతో తట్టుకోలేక కాంగ్రెస్​లోకి వెళ్లారు. దీంతో  జడ్పీలో భాగ్యలక్ష్మి ఒంటరి కాగా, హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్​ను ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయి. 

ఓదెలు వచ్చే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా మారే అవకాశం ఉండడంతో కాంగ్రెస్​లోని కోవర్టులను ఉసిగొల్పి ఆయన సొంతగూటికి తిరిగి వచ్చేలా చేశారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరిగింది. మొత్తానికి ఓదెలును యాక్టివ్ ​పాలిటిక్స్​లోనే లేకుండా చేసిన ఘనుడు  బాల్క సుమన్ ​అన్నది అందరూ అనుకుంటున్న మాట! అంతేగాకుండా చెన్నూర్ ​నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్​ను అగణదొక్కేందుకు రెండోసారి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నది ఆయనేనని సతీష్​ అనుచరులు నేటికీ మండిపడుతున్నారు. నియోజకవర్గంలో మరో కీలకనేత జడ్పీ మాజీ వైస్ ​చైర్మన్​మూల రాజిరెడ్డిని, భీమారం మండలానికి చెందిన చెరుకు సరోత్తంరెడ్డితో పాటు మరికొంతమంది లీడర్లను ప్లాన్​ ప్రకారం అణిచివేశారని ఆగ్రహంతో ఉన్నారు. వాళ్లంతా బీఆర్ఎస్​లో ఉండీ లేనట్టుగా ఉంటూ టైమ్ ​కోసం ఎదురుచూస్తున్నారు. 

దివాకర్​రావు, చిన్నయ్య టార్గెట్​గా..  

మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలపై ఆధిపత్యం కోసం సుమన్ అందివచ్చిన ఏ చాన్స్​నూ వదులుకోవడం లేదు. గతంలో సుమన్ ​వ్యవహార శైలి వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని దివాకర్​రావు, చిన్నయ్య సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులకు విన్నవించగా కాస్త కంట్రోల్​లో పెట్టారనే ప్రచారం ఉంది. కానీ ఇటీవల సుమన్​ వీరిద్దరిని టార్గెట్​ చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యను తొక్కి తనకు సన్నిహితుడైన రేణికుంట్ల ప్రవీణ్​కు టికెట్​ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్​ వర్గాలే వెల్లడిస్తున్నాయి. అరిజిన్​ డెయిరీ వివాదాన్ని చిన్నయ్య మెడకు చుట్టడంలో ఎవరి పాత్ర ఎంతన్న చర్చ నడుస్తోంది. ఇక సీనియర్​ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకు, సుమన్​మధ్య కూడా గ్యాప్ ​బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ నెల 9న సీఎం కేసీఆర్​పర్యటనతో ఇద్దరి విభేదాలు పీక్​లెవల్​కు చేరినట్టు తెలుస్తోంది. 

సీఎం సభా ఏర్పాట్లు మొదలు జనసమీకరణ దాకా అంతా వన్​మ్యాన్​ షో చేయడంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నట్టు చెప్తున్నారు. బహిరంగ సభలో ‘నన్నెందుకు మాట్లాడియ్యలే’దంటూ అందరిముందే సుమన్​పై దివాకర్​రావు ఫైర్​అయ్యారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో దివాకర్​రావును ఆయన కొడుకు విజిత్​రావు, ఎంపీ వెంకటేశ్ ​నేత వారించారు. సభ ముగిసిన తర్వాత వేదికపై కేసీఆర్​ను శాలువాతో సత్కరించబోగా ఆయన అసహనంతో తిరస్కరిస్తూ దివాకర్​రావును నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని దివాకర్​రావు జీర్ణించుకోలేకపోతున్నారని బీఆర్ఎస్​ లీడర్లు  చర్చించుకుంటున్నారు.