హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణకు 29 ఏళ్లుగా సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి నుంచి ఒకటే డిమాండ్ తో కేంద్రానికి విన్నవించామని, అనుకూలంగా ఉన్నామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి అవకాశమన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లుపెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని.. స్థానిక పార్టీలు కూడా వర్గీకరణకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇందుకు ఈనెల 3 నుంచి 22వ తేదీవరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఏపీ, తెలంగాణలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.