- మేడారంలో 50 బెడ్స్ ఆస్పత్రి.. రూట్లలో 42 మెడికల్ క్యాంపులు
- డిప్యూటేషన్ పై 544 మంది డాక్టర్లు 3,199 మంది సిబ్బందికి డ్యూటీలు
- 30 పెద్ద, 40 బైక్ అంబులెన్సులు రెడీ.. ఫుడ్ సేఫ్టీపైనా నజర్ పెట్టాలి
- వైద్యా శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: మేడారం జాతరలో భక్తులకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తక్షణం ట్రీట్ మెంట్ చేయాలి. హెల్త్ డైరెక్టర్(డీహెచ్) వెంటనే వెళ్లాలి. జాతర పూర్తయ్యేదాకా అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలి’’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. జాతరలో వైద్యశాఖ ఏర్పాట్లపై మంత్రి మంగళవారం ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.
భక్తుల రద్దీ దృష్ట్యా గద్దెల వద్ద, ప్రధాన క్యాంపుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 50 బెడ్ల ఆస్పత్రి సిద్ధం చేశామన్నారు. జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్ లో (ఎన్ రూట్) 42 క్యాంపులు కలిపి మొత్తం 72 మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లపై మంత్రికి మంత్రికి వివరించారు.
ఇప్పటి వరకు 11,625 మందికి వైద్యం అందించినట్లు, రాష్ట్రం నలుమూలల నుంచి వైద్య సిబ్బందిని జాతర డ్యూటీకి తరలించామని తెలిపారు. 3,199 మంది సిబ్బందిలో 544 మంది డాక్టర్లే ఉన్నారని చెప్పారు. మందులు, ఎక్విప్ మెంట్ కొరత రాకుండా చూడాలని మంత్రి సూచించారు. క్యాంపుల సమాచారం భక్తులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ట్రాఫిక్ జామ్ అయితే.. పేషెంట్ల వద్దకు ఈజీగా వెళ్లేందుకు 40 బైక్ అంబులెన్సులు, 108 అంబులెన్సులు 38 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎమర్జెన్సీ అయితే ములుగు జీజీహెచ్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించాలని, డాక్టర్లు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని మంత్రి ఆదేశించారు. జాతరలో అమ్మే ఆహార పదార్థాల నాణ్యతపైనా నిఘా పెట్టాలని ఆదేశించారు.
