- సిటీలో రెచ్చిపోతున్న పోకిరీలు
- డ్రంకన్ డ్రైవ్, బైక్ రేసింగ్స్ లతో చక్కర్లు
- సౌత్ జోన్ పరిధిలో నేరాలు చేస్తున్న యువత
- ఇల్లీగల్ యాక్టివిటీస్ పై పోలీసుల ఫోకస్
హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై అవారాలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు.హైస్పీడ్ బైక్లు, కార్లతో చక్కర్లు కొడుతున్నారు. రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు రోడ్లపై హంగామా చేస్తున్నారు. మద్యం మత్తులో మర్డర్లు చేస్తున్నారు. ఇలాంటిదే గత వారం జరిగిన ఇద్దరు రౌడీషీటర్స్ హత్యలతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి ఆవారాలు తిరుగుతున్న ఏరియాల్లో నిఘా పెంచారు. సిటీ కమిషనరేట్ పరిధిలోని సౌత్జోన్, వెస్ట్జోన్ ఆవారాలకు అడ్డాలుగా మారినట్లు గుర్తించారు.
ఓల్డ్సిటీలో బలాదూర్
ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి ఆవారాలు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీస్ ఫోకస్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్లు పోలీసులకు కంప్లయింట్స్ వస్తున్నాయి. మిడ్నైట్,వీకెండ్ పార్టీల పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారని లోకల్ పీఎస్ల్లో బాధితులు కంప్లయింట్స్ చేస్తున్నారు. సిటీ రోడ్లతో పాటు సైబరాబాద్,రాచకొండ లిమిట్స్లోని ఓఆర్ఆర్పై కార్లతో పోకిరీలు హైస్పీడ్లో డ్రైవ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత గ్రూపులుగా బయటకు వస్తున్నారు. వాట్సాప్లో లొకేషన్, టైమ్ షేర్ చేసుకుంటున్నారు. ఖాళీగా ఉన్న రోడ్లలో అడ్డదిడ్డంగా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ రూల్స్ బ్రేక్ చేస్తూ హైస్పీడ్తో దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తూ ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కెబీఆర్పార్క్, మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు బైక్ రేసింగ్స్ చేస్తున్నారు. పోలీస్ నిఘా తక్కువగా ఉండే ప్రాంతాలను అడ్డాలుగా సెలక్ట్ చేసుకుంటున్నారు.
14 మంది రౌడీషీటర్స్ పై పీడీ యాక్ట్ పెట్టాం
సౌత్జోన్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. నైట్ టైమ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. రోడ్లపై తిరిగే యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. పెట్రోలింగ్ వెహికల్స్తో గస్తీ ముమ్మరం చేశాం. 3 నెలల్లో 14 మంది రౌడీషీటర్స్పై పీడీ యాక్ట్ పెట్టాం. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాం. జనాలకు సెక్యూరిటీపై భరోసా కల్పించేందుకు రూట్ మార్చ్ నిర్వహిస్తున్నాం.-గజరావ్ భూపాల్, డీసీపీ, సిటీ సౌత్ జోన్
ర్యాండమ్ చెకింగ్
ఓల్డ్సిటీలో జరుగుతున్న మిడ్ నైట్ అఫెండర్స్, హత్యల సంఖ్య పెరిగిపోతుండడంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆవారాలు, రౌడీ షీటర్లకు చెక్ పెట్టేందుకు ర్యాండమ్ చెకింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌత్జోన్ పోలీసులు ఓల్డ్ సిటీ యువతపై నిఘా పెంచారు. రౌడీ షీటర్స్,ఓల్డ్ అఫెండర్స్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. మీర్చౌక్, భవానీనగర్, మాదన్నపేట్, సంతోష్నగర్, ఫలక్నుమాలో పోలీస్ పెట్రోలింగ్ పెంచారు. సోషల్ మీడియా, డయల్ 100కి వచ్చిన కాల్స్ డేటా ఆధారంగా అర్ధరాత్రి ఆవారాలు తిరుగుతున్న ఏరియాల్లో సెక్యూరిటీని పటిష్ఠం చేశారు.