కారు కూతలు కూస్తే కర్రు కాల్చి వాత పెట్టండి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 కారు కూతలు కూస్తే కర్రు కాల్చి వాత పెట్టండి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

 నేలకొండపల్లి, వెలుగు : కారు కూతలు కూసే వాళ్లకి భవిష్యత్​లో కర్రు కాల్చి వాత పెట్టండని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండలం కేంద్రంతోపాటు ముజ్జుగూడెం, నేలకొండపల్లి, బైరవునిపల్లి, బోదులబండ, చెన్నారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. 

గత ప్రభుత్వం చేసిన అప్పులకు  ప్రతినెలా అసలు, మిత్తి కలిపి రూ.6,500 కోట్లు కడుతూ తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం బొదులబండలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు నెల్లూరి భద్రయ్య, శాఖమూరి రమేశ్, కొడాలి గోవిందరావు, బొడ్డు బొందయ్య, రాయపూడి నవీన్, కుక్కల హనుమంతరావు, మామిడి వెంకన్న, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలరాజు కుటుంబానికి పరామర్శ.. 

మధిర, వెలుగు:  మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు, కాంగ్రెస్​ నాయకుడు  దారా బాలరాజు ఇటీవల గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసింది. ఆయన కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. బాలరాజు ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.