కాంట్రాక్టర్లు ఉన్నదెవరి కోసం .. ఆఫీసర్లపై మంత్రి సీతక్క ఫైర్

కాంట్రాక్టర్లు ఉన్నదెవరి కోసం .. ఆఫీసర్లపై మంత్రి సీతక్క ఫైర్
  • అంగన్ వాడి కేంద్రాల్లో త్వరలో ఫిజియోథెరపీ సేవలు
  • తప్పుడు సమాచారంపై వార్తలు రాస్తే కేసులు పెడ్తాం
  • భద్రాద్రి కలెక్టరేట్ లో వివిధ శాఖలతో రివ్యూ మీటింగ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మన కోసం కాంట్రాక్టర్లు ఉన్నారా.. కాంట్రాక్టర్ల కోసం మనం ఉన్నామా’’ అంటూ పంచాయతీరాజ్​ మినిష్టర్​ సీతక్క ఆఫీసర్ల తీరుపై ఫైర్ అయ్యారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్​లో పంచాయతీరాజ్​, మహిళా, శిశు, దివ్యాంగ, వృద్ధులు, మిషన్​భగీరథ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో మంత్రి మాట్లాడారు. టెండర్లు పూర్తయి  పనులు ప్రారంభించని కాంట్రాక్ట్ లను రద్దు చేయాలని ఆదేశించారు. ఇక ముందైనా పంచాయతీ రాజ్​ఆఫీసర్లు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. రోడ్లు బాగుంటేనే మారు మూల ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సరైన రోడ్లు లేకపోవడంతో ఆదివాసీ ప్రాంతాల ప్రజలు వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్ల కాలంలో కోయ సామాజిక వర్గం నుంచి తాను మాత్రమే మంత్రి వర్గంలో ఉన్నానన్నారు. కాంగ్రెస్​ అధిష్టానం, సీఎం రేవంత్​రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. సమష్టిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని స్పష్టంచేశారు.  అంగన్​వాడీ కేంద్రాల్లో త్వరలో ఫిజియో థెరపీ సేవలుందించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తప్పుడు సమాచారంపై వార్తలు రాస్తే కేసులు పెడ్తామన్నారు. వయోవృద్ధులకు టేక్​ కేర్​సెంటర్లను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్​ఎంపీ పోరిక బలరాం నాయక్​, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, రాందాస్​నాయక్​, మట్టా రాగమయి, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్, ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ పాల్గొన్నారు.