జూన్ 23 నుంచి హైదరాబాద్ లో MMTS రైళ్లు

జూన్ 23 నుంచి హైదరాబాద్ లో MMTS రైళ్లు

కరోనా కారణంగా 15 నెలల క్రితం హైదరాబాద్ లో నిలిచిపోయిన.. MMTS రైళ్లు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో వీటిని పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి 10 MMTS రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా.. మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

జూన్ 23 నుంచి నడవనున్న రైళ్లలో.. మూడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే ఫస్ట్ రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరనుండగా, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే మొదటి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే  తొలి రైలు ఉదయం 8.43 గంటలకు బయలుదేరనుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.