- ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘నో హెల్మెట్ - నో పెట్రోల్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన హెల్మెట్ ధరించిన వారికే పెట్రోల్ పోయాలని బంక్ యజమానులను కోరారు. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మానవ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు సామాజిక బాధ్యతగా నిబంధనలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, అవసరమైన చోట కౌన్సిలింగ్ కూడా ఇస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి,అడిషనల్ ఎస్పీ రమేశ్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి లావణ్య, ఎస్.బి సీఐ రాము, 2 టౌన్ సీఐ రాఘవరావు,1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్బీ రిటైర్ సీఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
