ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష నేడు దేశ వ్యాప్తంగా జరగనుంది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాయనుండగా.. ఏపీ నుంచి 70వేల మంది, తెలంగాణ నుంచి 80 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశంలోని 557 నగరాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలెటికల్ టూల్ను ఉపయోగించనున్నది. ఇది విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. పరీక్ష రాసే అభ్యర్థులు హల్ టికెట్ తో పాటుగా ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూప్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు. నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.