
ముంబై: 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ చేపట్టారు. సీఆర్పీఎఫ్, డీఆర్జీ, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్లు చేపడుతూ మావోయిస్టు కంచుకోటలను బద్దలు కొడుతున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే మావోయిస్టు పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టారు భద్రతా దళాలు.
మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్ నంబాల కేశవ్, సుధాకర్ వంటి టాప్ లీడర్లను ఎన్ కౌంటర్లో లేపేశారు. ఈ నష్టం నుంచి మావోయిస్టుల పూర్తిగా తేరుకోకముందే.. నక్సలైట్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రసాయుధ బలగాల్లో అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)ని రంగంలోకి దింపింది. మహారాష్ట్రలో మావోయిస్టుల కంచుకోటైన గడ్చిరోలిలో ఎన్ఎస్జీ బలగాలను మోహరించింది.
సాధారణంగా ఎన్ఎస్జీ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్ లాంటి ప్రమాదకరమైన ఆపరేషన్స్ చేపడుతోంది. కానీ ఫస్ట్ టైమ్ నక్సల్ వ్యతిరేక కార్యాకలపాల కోసం ఎన్ఎస్జీని బరిలోకి దింపారు. ఎన్ఎస్జీ రాకతో భద్రతా దళాలు శక్తి మరింత బలంగా మారనుంది. గడ్చిరౌలి ప్రాంతంలో నక్సలైట్ గ్రూపులకు వ్యతిరేకంగా కార్యకలాపాల ప్రభావాన్ని ఎన్ఎస్జీ మరింత పెంచుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలు తిని కోలుకోలేని స్థితిలో ఉన్న మావోయిస్ట్ పార్టీకి.. ఎన్ఎస్జీ బలగాల ఎంట్రీ మరింత ఇబ్బందిగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ మొరపెట్టుకుంటుండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం నక్సలైట్ల ప్రతిపాదనను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా ఎన్ఎస్ జీ రంగంలోకి దించడం చూస్తుంటే.. దేశంలో మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎంత బలంగా కోరుకుంటుందో స్పష్టమవుతోంది.