- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు/ తాడ్వాయి, వెలుగు: ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర జరుగుతుందని, సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యతని, పూజారులు, ఆదివాసీ సంఘాలు, అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వహణపై పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాతో కలిసి మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర విజయవంతం చేయడానికి పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకుల సహకారం ఎంతో కీలకమన్నారు.
వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించడానికి ప్రత్యేక పాలసీని రూపొందించాలని, జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు సేవలను అందించడానికి ఆదివాసీ సంఘాల నుంచి 500ల మంది యువకులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో శాశ్వత ప్రతిపాదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారులు, ఆదివాసి సంఘాల సలహాలు సూచనలు వారి సమన్వయంతో జాతర విజయవంతం చేస్తామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ వారసులుగా గిరిజనులకు గుర్తింపు లభిస్తుందని, ఆదివాసి సంఘాలు వారి సభ్యుల వివరాలు అధికారులకు అందించాలని పేర్కొన్నారు.
చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకువచేటప్పుడు ఆదివాసి యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వలంటరీ సభ్యులకు మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా బంద్ చేస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీవో వెంకటేశ్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి సంఘాల నాయకులు, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం ఉదయం ములుగు జిల్లా కేంద్రంలో రూ.11 లక్షలతో నిర్మించిన హమాలీ కమ్యూనిటీ నూతన భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, ములుగు హమాలీ సంఘం అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
