- ఇప్పటి వరకు మార్కెట్ నష్టాలను చూడని కొత్త ఇన్వెస్టర్లు
- మార్కెట్ ముమెంటం కంటే తమ రీసెర్చ్ వలనే లాభపడుతున్నామని భావిస్తున్నారు
- మార్కెట్లు పడగలవనే ఆలోచన ఇన్వెస్టర్లకు ఉండాలి: జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్
బిజినెస్డెస్క్, వెలుగు: గత ఏడాదిన్నర నుంచి మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు పెద్ద నష్టాలను చూడలేదు. మార్కెట్ కూడా ఇంకా పెద్దగా కరెక్ట్ (పడడం) కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై జాగ్రత్తగా ఉండాలని ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ ఇన్వెస్టర్లకు సలహాయిచ్చారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం ఈజీ అని కొత్తగా ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు భావిస్తున్నారన్నారు. ‘ఏ షేరు కొన్నా పెరుగుతోంది. మార్కెట్ ముమెంటం కంటే తమ రీసెర్చ్ స్కిల్స్ వలనే లాభాలొస్తున్నాయని కొత్త ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లు బిజినెస్ లేదా వాల్యుయేషన్ చూడకుండా షేర్లను కొంటున్నారు. వాళ్ల ఫ్రెండ్స్కు 30–50 శాతం లేదా అంతకంటే ఎక్కువ లాభం వచ్చిందని మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి ఆలోచనలే పతనానికి కారణమవుతాయి. మార్కెట్ హిస్టరీ చూస్తే షేర్లు కొన్నేళ్ల పాటు పడుతుండడం చూడొచ్చు. ఎప్పుడు పరిస్థితులు తారుమారవుతాయో, మార్కెట్లు కరెక్ట్ అవుతాయో చెప్పడం కష్టం’ అని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు మార్కెట్ కరెక్షన్ను ఇప్పటి వరకు అనుభవించలేదని చెప్పారు. బుల్ మార్కెట్లోనే కాదు, బేర్ మార్కెట్లో కూడా ఎలా నడుచుకోవాలో ప్లాన్ చేసుకోవాలని సలహాయిచ్చారు.
ఆన్లైన్ ట్రేడింగ్లో టెక్నాలజీనే ముఖ్యం...
ఆన్లైన్ బ్రోకింగ్లో కాంపిటేషన్ పెరుగుతోంది. చాలా కంపెనీలు డిస్కౌంట్ బ్రోకింగ్లను తీసుకొచ్చి ఇన్వెస్టర్లకు తక్కువ రేటుకే సర్వీస్లను అందిస్తున్నాయి. ఆన్లైన్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో టెక్నాలజీదే కీలక పాత్ర అని నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. ట్రెడిషనల్గా అయితే బ్రోకింగ్ ఇండస్ట్రీలో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ముఖ్య పాత్ర పోషించేది. ఇన్వెస్టర్ల కోసం ఎటువంటి టూల్స్ను కంపెనీలు అందిస్తున్నాయనే అంశాలు ప్రస్తుతం కీలకంగా మారాయని చెప్పారు. క్రెడిబిలిటీ కూడా కీలకంగా పనిచేస్తోందని అన్నారు. కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి పారదర్శకత ముఖ్యమన్నారు.
మ్యూచువల్ ఫండ్స్ మారాలి..
ట్రూ బీకన్ పేరుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా నిఖిల్ కామత్ నడుపుతున్నారు. ఈ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన పంచుకున్నారు. ధనవంతుల అసెట్స్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ‘ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ తన డబ్బులను ఇన్వెస్ట్ చేద్దామనుకున్నాడు. సాధారణంగా అతను ప్రైవేట్ బ్యాంకుకో లేదా వెల్త్ మేనేజర్ దగ్గరకో వెళతాడు. ఫండ్ మేనేజర్తో కలపడానికి ఈ కంపెనీలు 1–2 శాతం డిస్ట్రిబ్యూటర్ ఫీజు లేదా సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్నాయి. ఇన్వెస్టర్కు లాభాలొచ్చినా రాకపోయినా ఫండ్ మేనేజర్లు ఏడాదికి 2 శాతం ఛార్జీని వసూలు చేస్తున్నారు. 2 శాతం ఎక్కువగా కనబడకపోయినా, ఓ 20 ఏళ్లలో మొత్తం క్యాపిటల్లో 50 శాతానికి ఇది చేరుకుంటుంది. వీటికి తోడు ఇన్వెస్ట్ చేశాక కొన్నేళ్లు బయటకు రాకూడదు. వస్తే ఛార్జీలు చెల్లించాలి వంటి రూల్స్ ఉంటాయి’ అని నిఖిల్ కామత్ అన్నారు. ట్రూ బీకాన్ ద్వారా ఇలాంటి ఫీజులు, ఛార్జీలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఎటువంటి యాన్యువల్ మెయింటనెన్స్ ఫీజులు వసూలు చేయడం లేదన్నారు. ఇన్వెస్టర్కు వచ్చిన ప్రాఫిట్లో మాత్రమే10 శాతం వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇన్వెస్టర్ కావాలంటే ఫండ్ నుంచి ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వొచ్చని గుర్తు చేశారు. ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మార్కెట్లు ఎక్కువ రేటుతో ఉన్నాయని నిఖిల్ అభిప్రాయపడ్డారు. అందుకే ఇన్వెస్టర్లకు రిస్క్ తగ్గించడానికి ఈక్విటీలు, డెట్ అసెట్స్తో కలిపి హైబ్రిడ్ ఫండ్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయను..
క్రిప్టో కరెన్సీలు పాపులర్ అవుతుంటే నిఖిల్ మాత్రం వాటిలో ఇన్వెస్ట్ చేయనని చెప్పారు. క్రిప్టోకి సంబంధించి ప్రతీ అంశంపై నెగెటివ్గా ఉన్నానని అన్నారు. క్రిప్టో కరెన్సీలకు ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకులకు మధ్య జరిగే వార్లో తన డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వం వైపు పెడతానని అన్నారు. క్రిప్టోలు పాపులర్ అయ్యే కొద్ది ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకుల పవర్ తగ్గుతుందని పేర్కొన్నారు. ‘క్రిప్టోలకు నేను పెద్ద ఫ్యాన్ కాదు. ముందు నుంచి కూడా ఇదే ఆలోచనతో ఉన్నా. ఇప్పటి వరకు క్రిప్టోకరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదు’ అని నిఖిల్ పేర్కొన్నారు.