సూర్యుడి రహస్యాలపై అధ్యయనం చేసేందుకు ఇస్రో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 రాకెట్ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. మొదటి కీలకమైన నాలుగు దశలను ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా దాటడంతో ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. పీఎస్ఎల్వీ రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా వేరు చేయబడిందని ఇస్రో తెలిపింది. ఎల్ 1 పాయింట్ వద్దకు ఉపగ్రహం ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొంది.
మోదీ అభినందనలు..
చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. సమస్త మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహన పెంపొందించేందుకు అవిశ్రాంతమైన శాస్త్రీయ కృషి కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
After the success of Chandrayaan-3, India continues its space journey.
— Narendra Modi (@narendramodi) September 2, 2023
Congratulations to our scientists and engineers at @isro for the successful launch of India’s first Solar Mission, Aditya -L1.
Our tireless scientific efforts will continue in order to develop better…
శాస్త్రవేత్తల సంబురాలు
ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు చెప్పారు. ఆదిత్య ఎల్ 1 దాదాపు 125 రోజులు ప్రయాణించి.. ఎల్ 1 పాయింట్ను చేరుకుంటుందని.. ఆదిత్య ఎల్1కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని అన్నారు. అటు ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సక్సెస్ కావడంపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.