బీజేపీ, టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ పడతాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ అవినీతి చేస్తున్నాడని పదే పదే చెప్తున్న బీజేపీ నేతలు..ఈడీ , సీబీఐలతో ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ వాపును చూసుకొని బలుపు అనుకుంటుందని చురకలంటించారు. బీజేపీ, టీఆర్ఎస్లు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మునుగోడులో టిఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ బీజేపీ అని పొన్న ప్రభాకర్ అన్నారు. 8 ఏండ్లు అయినా రాష్ట్ర విభిజన హామీలను బీజేపీ నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ..తెలంగాణ అమరవీరులను అవహేళన చేసిందని చెప్పారు. అలాంటి బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని..రెండు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు తెలంగాణ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన కోరారు.