- చిప్ల ప్లాంట్లు పెట్టేందుకు కంపెనీల రెస్పాన్స్ అదుర్స్!
- డిస్ప్లే సెగ్మెంట్లో 2, డిజైన్లో 3, సెమికండక్టర్ల ప్యాకేజింగ్లో 4 కంపెనీలు ఆసక్తి
న్యూఢిల్లీ: పీఎల్ఐ స్కీమ్ కింద దేశంలో ఎలక్ట్రానిక్ చిప్లు, డిస్ప్లేల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి మొత్తం ఐదు కంపెనీలు తమ ప్రపోజల్స్ను సబ్మిట్ చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం రూ. 1.53 లక్షల కోట్లను ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. వేదాంత ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్, ఐజీఎస్ఎస్ వెంచర్స్, ఐఎస్ఎంసీ కంపెనీలు చిప్లను తయారు చేయడానికి ప్రపోజల్స్ను సబ్మిట్ చేశాయి. 13.6 బిలియన్ డాలర్ల (రూ. 1.02 లక్షల కోట్ల) ను ఇన్వెస్ట్ చేయడానికి ముందు కొచ్చిన ఈ కంపెనీలు, పీఎల్ఐ కింద 5.6 బిలియన్ డాలర్ల (రూ. 42 వేల కోట్ల) రాయితీలను కోరుతున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ ప్రకటించింది. కాగా, దేశంలో చిప్ల తయారీని పెంచేందుకు రూ. 76 వేల కోట్లతో పీఎల్ఐ స్కీమ్ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ (టీవీ స్క్రీన్లు వంటివి) సెగ్మెంట్లో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వేదాంత, ఎలెస్ట్ కంపెనీలు తమ ప్రపోజల్స్ను సబ్మిట్ చేశాయని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 6.7 బిలియన్ డాలర్ల (రూ. 50,250 కోట్ల) ను ఇన్వెస్ట్ చేస్తామని, 2.7 బిలియన్ డాలర్ల (రూ. 20,250 కోట్ల) విలువైన రాయితీలు ఇవ్వాలని ఈ కంపెనీలు కోరుతున్నాయి. సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ సెగ్మెంట్లో ప్లాంట్లను పెట్టడానికి ఎస్పీఈఎల్ సెమికండక్టర్, హెచ్సీఎల్, సైర్మా టెక్నాలజీ, వాలెంకని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకున్నాయి. కాంపౌండ్ సెమికండక్టర్ల కోసం రట్టౌన్షా ఇంటర్నేషనల్ రెక్టిఫైర్ రిజిస్టర్ చేసుకుందని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ సెగ్మెంట్లో టెర్మినస్ సర్క్యూట్స్, ట్రైస్పేస్ టెక్నాలజీస్, క్యూరీ మైక్రో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తమ ప్రపోజల్స్ను సబ్మిట్ చేశాయి.