
- లోలెవల్ బ్రిడ్జిలతో అవస్థలు
- హైలెవెల్ బ్రిడ్జిలతోనే సమస్య పరిష్కారం
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్ అవుతున్నాయి. జోరువానలతో వాగులు, వంకలు పొంగినప్పుడల్లా జనం జీవనం స్తంభించిపోతోంది. జిల్లాలో 13 మండలాలు ఉండగా.. 9 మండలాల్లో ఈ సమస్య నెలకొని ఉంది. లోలెవల్ బ్రిడ్జిల వల్లే ఈ సమస్య ఎదురవుతోందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్రిడ్జిలు పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
లోలెవల్ బ్రిడ్జిల వల్లే..
- జిల్లాలో 13 మండలాలు ఉండగా.. 9 మండలాల్లో లోలెవెల్ బ్రిడ్జిల పైనుంచి వాగులు పొంగి రాకపోకలు బంద్ అవుతున్నాయి. ప్రస్తుతమున్న బ్రిడ్జిలు కట్టి దశాబ్దాలవుతుండగా.. వానలు దంచికొడితే బ్రిడ్జిలపై నీరు ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు చందుర్తి మండలం ఎన్గల్ బ్రిడ్జి పైనుంచి నక్కవాగు ప్రవహించడంతో ఎన్గల్, బండపల్లి, బావుసాయిపేట గ్రామాలకు కోనరావుపేట మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. చందుర్తి, వేములవాడ, కోనరావుపేట, వేములవాడ రూరల్, బోయినిపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాల మధ్య రాకపోకలు నిలుస్తున్నాయి.
- బోయినిపల్లి మండలం కొదురుపాక వద్ద కోరెం వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ గ్రామంలో మండల కేంద్రానికి రాకపోకలు అంతరాయం కలుగుతోంది. బోయినిపల్లి, వేములవాడ మధ్య స్థంభంపల్లి గంజి వాగు ప్రవాహంతో రాకపోకలు నిలుచిపోతున్నాయి. ఇక్కడ 2023లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా పనులు పూర్తికాలేదు. ఈ బ్రిడ్జిని పూర్తిచేయాలని ఇటీవల బోయిన్పల్లి మండల ప్రజలు పాదయాత్ర చేసి కలెక్టరేట్ను ముట్టడించారు.
- ఎల్లారెడ్డిపేట మండలం కోరుటపేట గ్రామంలో గంగమ్మ కుడి వద్ద మానేరు ఉధృతికి గంభీరావుపేట–ఎల్లారెడ్డిపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. నర్మాల వద్ద ఉన్న లోలెవల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహించడంతో గంభీరావుపేట, లింగన్నపేట, కోళ్లమద్ది, మాచారెడ్డి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. గంభీరావుపేట మండలం మల్లుపల్లి, గోరింటాల మధ్య లోలెవల్ బ్రిడ్జిల వల్ల రాకపోకలు నిలుస్తున్నాయి. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ్పల్లె గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి పైనుంచి వాగు పొంగి పదిర గ్రామానికి రాకపోకలు ఆగిపోతున్నాయి.
- చందుర్తి మండలంలో లౌడ్ చెరువు మత్తడి మడితే మండలకేంద్రం నుంచి రామన్నపేటకు, బండపల్లి, బావుసాయిపేట గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు మత్తడి పోస్తే రాకపోకలు నిలుస్తున్నాయి. నక్కవాగు ఉధృతితో ఎన్గల్, బండపల్లి మధ్య రాకపోకలు బంద్ అవుతున్నాయి. దీంతోపాటు ఎన్గల్ చెరువు నిండితే మల్యాల మండలానికి రాకపోకలు తెగిపోతున్నాయి. మూడపల్లి గ్రామ చెరువు అలుగుపోస్తే ఈ గ్రామానికి రాకపోకలు నిలుస్తున్నాయి. ఇక్కడి హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు ఆరు నెలల కింద భూమిపూజ చేశారు. కానీ నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
- రుద్రంగి మండలంలోని గండి వేంకటేశ్వర టెంపుల్ వద్ద గుట్టల పై నుంచి వచ్చే వరదలతో ఎన్గల్– రుద్రంగి మద్య రాకపోకలు నిలిచిపోతున్నాయి.
- కోనరావుపేట మండలం నిమ్మపల్లి వాగు, మూలవాగు పొంగడంతో మామిడిపల్లి, నిజాంబాద్, వెంకట్రావుపేట, బావుసాయిపేట, వట్టిమల్ల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అవుతున్నాయి. దీంతోపాటు వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి, వన్పల్లి గ్రామాలకు రాకపోకలు నిలుస్తున్నాయి. పెద్దవాగు ఉధృతితో మద్దిమల్ల, వీర్నపల్లి గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
- తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ వాగు పొంగడం వల్ల తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల మద్య రాకపోకలు నిలుస్తున్నాయి.
నాలుగు బ్రిడ్జిలు పూర్తి
జిల్లాలో ఇప్పటివరకు నాలుగు మండలాల్లో హైలెవెల్ బ్రిడ్జిలు పూర్తయ్యాయి. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి వద్ద రూ.3.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఇదే మండలం హన్మాజీపేట నక్కవాగుపై రూ.11.55 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం వద్ద మూలవాగుపై రూ.1 కోటితో బ్రిడ్జి నిర్మించారు. కాగా అడవి పదిర, భూక్యతండా గ్రామాల మధ్య మొదలెట్టిన బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.